రాహుల్ పర్యటన సందర్భంగా వరంగల్ లో ట్రాఫిక్ మళ్ళింపు

రాహుల్ పర్యటన సందర్భంగా వరంగల్ లో ట్రాఫిక్ మళ్ళింపు

6వ తేదీన వరంగల్ ఆర్ట్స్, సైన్స్ కాలేజీ ఆవరణలో నిర్వహించనున్న కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నుండి వరంగల్ కు వచ్చే వాహనాలు పెద్ద పెండ్యాల ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఉనికిచెర్ల, వడ్డేపల్లి చర్చ్, ఎన్జీవోస్ కాలనీ మీదుగా చేరుకోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసు అధికారులు చెప్పారు. హైదరాబాద్ వైపు నుండి వచ్చే వాహనాలు ఫాతిమా (మదర్ థెరిస్సా) జంక్షన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలను దింపి, తిరిగి మడికొండ వైపుగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో తమ వాహనాలు నిలిపి ఉంచాలన్నారు. 

  •  ఖమ్మం, మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూరు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చే వాహనాలు నాయుడు పెట్రోల్ పంపు, ఉర్సుగుట్ట, హంటర్ రోడ్డు మీదుగా నీలిమ జంక్షన్ (విష్ణుప్రియ గార్డెన్స్) వద్ద కార్యకర్తలను దించి, ప్రకాశ్ రెడ్డిపేట పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలుపుకోవాలని సూచించారు. ఇక్కడ పార్కింగ్ పూర్తయితే WIMS కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేయాలన్నారు. 
  • ములుగు, భూపాలపల్లి ప్రాంతాల నుండి వచ్చే వాహనాలు.. కార్యకర్తలను కాళోజీ సెంటర్ లో దింపి, హయగ్రీవాచారి కాంపౌండ్ లో పార్కింగ్ చేసుకోవాలని చెప్పారు.  అక్కడ కూడా పార్కింగ్ పూర్తయితే ములుగు రోడ్డు వద్ద ఉన్న ఎల్బీ కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేయవచ్చన్నారు. కరీంనగర్ వైపు నుండి వచ్చే వాహనాలు కాళోజీ సెంటర్ లో కాంగ్రెస్ కార్యకర్తలను దింపి, KUC SVS కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేయాలన్నారు. 
  • వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు అంబేడ్కర్ జంక్షన్, ఎన్జీవోస్ కాలనీ, వడ్డేపల్లి చర్చ్ మీదుగా మదర్ థెరిస్సా జంక్షన్ వైపు ప్రయాణించి, హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంటుందన్నారు. లేదా కరీంనగర్ రోడ్డు, KUC, చింతగట్టు వద్ద ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్ళాల్సి ఉంటుందని చెప్పారు. 

ఈనెల 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి హన్మకొండ కాళోజీ జంక్షన్ నుండి కాజీపేట వైపునకు ఎలాంటి భారీ వాహనాలు అనుమతించబడవని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం.. 

రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు

కాంగ్రెస్ చేసే యుద్ధానికి రైతులు అండగా ఉండాలె