
ముంబై: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దారుణం జరిగింది. చత్రపతి మల్టీస్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులు తన ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులను తిరిగి ఇవ్వట్లేదనే మనస్తాపంతో సురేశ్ జాదవ్(46) అనే రైతు బ్యాంక్ ముందే ఉరి వేసుకున్నాడు. జియోరాయ్ తహసీల్లోని ఖలేగావ్కు చెందిన సురేశ్ జాదవ్..2020లో తన 3.5 ఎకరాల భూమిని అమ్మి వచ్చిన రూ.11.50 లక్షల డబ్బును గెవ్రాయ్ సిటీలోని చత్రపతి మల్టీస్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని కోరుతుంటే రెండేండ్లుగా బ్యాంకు అధికారులు వేధిస్తున్నారు.
సురేశ్ జాదవ్ ఆర్నెళ్ల క్రితం విషం బాటిల్తో బ్యాంక్కు వెళ్లి తన డబ్బు తిరిగివ్వకుంటే చనిపోతానని బెదిరించాడు. దాంతో అప్పటి చైర్మన్ రూ.2.5 లక్షలు ఇచ్చి మిగిలిన మొత్తాన్ని రెండు నెలల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఈ క్రమంలోనే సురేశ్ జాదవ్ .. మంగళవారం తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బ్యాంకుకు వెళ్లాడు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాగా.. మేనేజర్ వారిని ఆఫీస్ నుంచి గెంటేశాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన సురేశ్ జాదవ్.. బుధవారం తెల్లవారుజామున బ్యాంక్ ముందు ఉరివేసుకుని చనిపోయాడు.