
-అపోలో హాస్పిటల్స్ ఎండీ సునీతా రెడ్డి
71 వేల హాస్పిటల్స్ సిద్ధం.. ప్రభుత్వ ఆమోదం కోసం చూస్తున్నాం -సునీతారెడ్డి
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద హాస్పిటల్ చెయిన్ అపోలో హాస్పిటల్స్ రోజుకు 10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్టు ప్రకటించింది. దీనికోసం దేశవ్యాప్తంగా ఉన్న 71 వేల హాస్పిటల్స్లో ఆరు వేల మంది స్టాఫ్కు శిక్షణ ఇస్తున్నట్టు మేనేజింగ్ డైరెక్టర్ సునీతా రెడ్డి బ్లూమ్బర్గ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వేల కొద్దీ క్లినిక్స్, ఫార్మసీలను దీనికి సిద్ధం చేస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. అయితే వ్యాక్సిన్ల డిస్ట్రిబ్యూషన్పై ఇంకా ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని, ప్రైవేట్ హెల్త్కేర్ సర్వీసులను దీనిలో భాగం చేస్తాయో లేదో ఇంకా తేల లేదని చెప్పారు. ఈ కన్ఫర్మేషన్ కోసం ఢిల్లీలోని అధికారులతో మాట్లాడుతున్నట్టు తెలిపారు. వ్యాక్సిన్ షాట్ వచ్చే 60 నుంచి 120 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని సునీతా రెడ్డి భావిస్తున్నారు. తమ హాస్పిటల్స్లో 30 వేల మంది కరోనా పేషెంట్లకు ట్రీట్ చేశామని, 4 లక్షల టెస్ట్లు చేసినట్టు తెలిపారు. సిరమ్తో చర్చలు…
వ్యాక్సిన్లను లాంచ్ చేసేందుకు కంపెనీలు పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్తో కలిసి పనిచేస్తున్నాయి. కానీ 130 కోట్ల మంది జనాభాకు ఎంత వేగంగా వ్యాక్సిన్ అందించగలుగుతారోనని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ఈక్వల్ యాక్సస్ కూడా ఉంటుందంటున్నారు. అపోలో హాస్పిటల్స్ ఇప్పటికే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోసం సిరమ్ ఇన్స్టిట్యూట్తో చర్చలు జరిపింది. ఢిల్లీ అధికారుల ఆమోదం కోసం కంపెనీ వేచిచూస్తోందని సునీతా రెడ్డి తెలిపారు. కానీ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన ప్రతి ఒక్క కంపెనీ కూడా ప్రభుత్వానికే తొలి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయని అన్నారు. ప్రైవేట్ ప్లేయర్స్ నుంచి కూడా సాయం తీసుకుని ఇమ్యూనైజేషన్ నెట్వర్క్ను మరింత పెంచాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కరోనాతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఆ మూడు నెలల కాలంలో కంపెనీకి రూ.208 కోట్ల నష్టం వచ్చినట్టు చెప్పారు. ప్రస్తుతం అంచనావేసిన దానికంటే వేగంగా రికవరీ సాధించామని, గత క్వార్టర్లో రూ.60.27 కోట్ల నెట్ ఇన్కమ్ను ఆర్జించినట్టు తెలిపారు.
మెడికల్ టూరిజం..
అపోలోకు 12 శాతం రెవెన్యూ ఇంటర్నేషనల్ కస్టమర్ల నుంచే వస్తోంది. ప్రతేడాది వేలమంది విదేశీ పేషెంట్లను అపోలో ట్రీట్ చేస్తోంది. కానీ కరోనా కారణంతో అక్టోబర్ వరకు సరిహద్దులను మూసివేయడంతో మెడికల్ టూరిజం కాస్త దెబ్బతింది. మెడికల్ టూరిజంలో వచ్చిన నష్టాన్ని పెరిగిన లోకల్ డిమాండ్ భర్తీ చేస్తోందని సునీతా రెడ్డి అన్నారు. విదేశాల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్లేవారు ఇప్పుడు అపోలో కస్టమర్లుగా మారారని చెప్పారు. అపోలో హాస్పిటల్స్ అక్యుపెన్సీ రేట్స్ ప్రీ కరోనా లెవెల్స్లో 67 శాతానికి చేరుకున్నాయని తెలిపారు.
కరోనా టెస్టింగ్ కిట్లపై సీసీఎంబీ, అపోలో ఎంఓయూ
ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కిట్ల తయారీపై సీసీఎంబీ, అపోలో ఆసుపత్రి మధ్య ఒప్పందం కుదిరింది. రెండు సంస్థల ప్రతినిధులు గురువారం ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ కిట్లతో 40 నుంచి 50 శాతం వరకు ఖర్చు తగ్గుతుందని, సమయం కూడా ఆదా అవుతుందని వారు పేర్కొన్నారు. కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదముందని, ఈ టైమ్ లో టెస్టులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు. సీసీఎంబీతో కలిసి పని చేయడంపై అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.