
- కొత్తగూడెం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో సేకరించే బ్లడ్, యూరిన్ శాంపిల్స్ను డయాగ్నస్టిక్ హబ్స్కు తరలించేందుకు డ్రోన్లను వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ను కొత్తగూడెం జిల్లాలో చేపట్టాలని నిర్ణయించింది. ఇటీవల హైదరాబాద్ నుంచి ఐటీ టీమ్ వెళ్లి కొత్తగూడెంలోని డయాగ్నస్టిక్ హబ్ను పరిశీలించింది. రోజూ హబ్కు వస్తున్న శాంపిళ్ల సంఖ్య, వాటి బరువు, తదితర వివరాలపై ఈ టీమ్ వివరాలు సేకరించింది. అలాగే, హబ్ పరిసరాల్లో డ్రోన్ దిగడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాన్ని మార్క్ చేసినట్టు తెలిసింది. పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించడంపై మెడికల్, హెల్త్ ఆఫీసర్లతో చర్చలు కూడా జరిపింది.
టైమ్, మనీ ఆదా
రాష్ట్రంలో 20 జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్ హబ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆయా జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లోని పీహెచ్సీల నుంచి శాంపిల్స్ను వెహికల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇదే పని డ్రోన్లతో చేస్తే సమయం, ఖర్చు ఆదా అవుతాయని ఆఫీసర్లు భావిస్తున్నారు. నాలుగైదు పీహెచ్సీల శాంపిల్స్ను ఒక చోటుకు చేర్చి, ఆపై డ్రోన్ ద్వారా హబ్కు చేర్చాలని భావిస్తున్నారు.