అన్నదాతపై హమాలీల దాడి..

అన్నదాతపై హమాలీల దాడి..
  • భైంసా వ్యవసాయ మార్కెట్లో ఘటన
  • చర్యలు తీసుకోవాలని రైతుల ఆందోళన
  • 2 గంటల పాటు నిలిచిన కొనుగోళ్లు
  • అధికారుల హామీతో విరమణ

భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసాలోని గాంధీ గంజ్​లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఓ రైతుపై హమాలీలు దాడి చేయడం కలకలం రేపింది. దీంతో రెండు గంటల పాటు కొనుగోళ్లు నిలిచిపోయాయి. లోకేశ్వరం మండలం వట్టోలి గ్రామానికి చెందిన శ్రీనివాస్​అనే రైతు సోయా అమ్మేందుకు మార్కెట్​కు తీసుకువచ్చాడు. ధర మాట్లాడుకున్న తర్వాత హమాలీలు జల్లెడ పట్టే క్రమంలో కొంత సరుకు కింద పడింది. 

దాన్ని శ్రీనివాస్ గోనె సంచుల్లో ​నింపుకుంటున్నాడు. హమాలీలు వచ్చి ఎందుకు నింపుతున్నావంటూ రైతుతో వాగ్వాదానికి దిగారు. తనకు తెలియక నింపుకుంటున్నానని చెప్పగా, ఈవిషయంలో ఇరు వర్గాల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో శ్రీనివాస్​పై హమాలీలు ఖాళీ పీపా డబ్బాలతో దాడి చేయగా..తల, ముఖంపై గాయాలయ్యాయి. ఇది చూసిన ఖరీదుదారులు, మార్కెట్​ఆఫీసర్లు, రైతులు ఆపారు. 

దాడిని నిరసిస్తూ రైతులు పెద్ద సంఖ్యలో గంజ్​గేటు ముందు మెయిన్​రోడ్డుపై ఆందోళనకు దిగారు. టౌన్ ​సీఐ ఎల్.శ్రీను, ఎస్సై శ్రీకాంత్ అక్కడికి వచ్చి దాడి చేసిన హమాలీలను, ఖరీదుదారుడిని అదుపులోకి తీసుకొని పోలీస్​స్టేషన్​కు తరలించారు. అయితే దాడి చేసిన హమాలీలను తమకు అప్పగించేంతవరకు ఆందోళన విరమించేదిలేదని రైతులు తేల్చి చెప్పారు. దీంతో రెండు గంటల పాటు కొనుగోళ్లు నిలిచిపోయాయి. 

ఏఎంసీ వైస్ ​చైర్మన్ ​జేకే పటేల్, సెక్రెటరీ శ్రీనివాస్​, సీఐ రైతులను సముదాయించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మార్కెట్​ఆఫీసర్లు, పాలకవర్గంతో వాగ్వాదానికి దిగారు. హమాలీల ఆగడాలు మితిమీరుతున్నాయని, చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేయగా..యాక్షన్​ తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. తర్వాత గాయపడిన రైతు శ్రీనివాస్​ను దవాఖానకు తరలించారు.