కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్పై.. కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్పై..   కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్
  • కొత్తగూడెంలో త్రిముఖ, ఇల్లెందు, అశ్వారావుపేటల్లో ద్విముఖ పోటీ
  • కార్పొరేషన్లో మకాం వేసిన ఎంపీ రామసహాయం 
  • ముగ్గురు కో ఆర్డినేటర్లను నియమించిన టీపీసీసీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​పై కాంగ్రెస్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. కొత్తగూడెం కార్పొరేషన్​ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రత్యేకంగా పీసీసీ ముగ్గురు కో ఆర్డినేటర్లను నియమించింది. రెవన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఇప్పటికే ఒక దఫా ప్రచారం నిర్వహించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి కార్పొరేషన్​లో మకాం వేశారు. కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్ లో త్రిముఖ పోటీ నెలకొంది. ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ద్విముఖ పోరు నెలకొంది. 

కొత్తగూడెంపై కాంగ్రెస్​ ప్రత్యేక దృష్టి​..

రాష్ట్రంలోనే కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​పై పలు పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. కొత్తగూడెం నియోజకవర్గం నుంచే సీపీఐ స్టేట్​ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంట్​, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​, సీపీఐ కలిసి పోటీ చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ మద్ధతుతో కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలిచారు.  కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్ లో  సీట్ల కేటాయింపులో కాంగ్రెస్​, సీపీఐల  మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో ఇరు పార్టీలు ఈ కార్పొరేషన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కార్పొరేషన్​లోని 60 డివిజన్లకు కాంగ్రెస్​ మొత్తం డివిజన్లలో పోటీ చేస్తోంది. టీడీపీతో కలిసి సీపీఐ 59 డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ఇప్పటికే కార్పొరేషన్​లో మకాం వేశారు. అభ్యర్థుల ఎంపికలో కీలక భూమిక పోషించారు.

 రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి గురువారం కార్పొరేషన్​ పరిధిలోని పలుచోట్ల కార్నర్​ మీటింగ్​లు నిర్వహించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ లో నేతల మధ్య కొంత గ్యాప్​ ఉంది. ఈ గ్యాప్​ను పూడ్చడంతో పాటు అందరిని కో ఆర్డినేషన్​ చేసుకునేందుకు పీసీసీ ముగ్గురు కో ఆర్డినేటర్లను నియమించింది. తుళ్లూరి బ్రహ్మయ్య, బాలసాని లక్ష్మీనారాయణ, ఎస్​. జగదీశ్వర్​ రావులను ప్రత్యేకంగా కో ఆర్డినేటర్లుగా పీసీసీ నియమించింది. 

కొత్తగూడెంలో త్రిముఖ పోటీ : కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్ లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్​, సీపీఐ, బీఆర్​ఎస్​ల మధ్య పోటీ ఉంది. నిన్నటి దాకా కలిసి పనిచేసిన కాంగ్రెస్​, సీపీఐ పార్టీలు కార్పొరేషన్ ఎన్నికల్లో నువ్వా నేనా అనే విధంగా ఫైట్​ చేస్తున్నాయి. కొత్తగూడెం కార్పోరేషన్​గా ఏర్పడక ముందుకు బీఆర్​ఎస్​ పాలకవర్గం ఉంది. కాంగ్రెస్​ సీపీఎంతో పొత్తు పెట్టుకుంది. సీపీఐ టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగింది. కార్పోరేషన్​లో తొలి మేయర్​గా తమ పార్టీకి చెందిన అభ్యర్థే ఉండాలనే టార్గెట్​ పెట్టుకొని కాంగ్రెస్​తో పాటు సీపీఐ, బీఆర్​ఎస్​లు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. పోటా పోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. 

ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో : ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ద్విముఖ పోటీ నెలకొంది. ఇల్లెందు మున్సిపాలిటీలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ కూటమి పార్టీల మధ్య పోరు నెలకొంది. కాంగ్రెస్​ ఒంటరిగా బరిలోకి దిగింది. సీపీఐ, సీపీఎం, మాస్​లైన్​ పార్టీలతో కలిసి బీఆర్​ఎస్​ ఎన్నికల్లో పోటీ చేస్తొంది. అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్​ ఒంటరిగా పోటీ చేస్తుండగా, టీడీపీతో కలిసి బీఆర్​ఎస్​ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇల్లెందు, అశ్వారావు పేట మున్సిపాలిటీల్లో పోరు రసవత్తరంగా సాగుతోంది.