
ఏటూరునాగారం, వెలుగు : అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగించేందుకు వెళ్లిన ఆఫీసర్లు, పోలీసులపై స్థానికులు కర్రలు, కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రోహీర్ గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... రోహిర్ గ్రామ సమీపంలోని చల్పాక రహదారి పక్కన ఉన్న అటవీ శాఖకు చెందిన భూమిలో కొందరు గిరిజనులు గుడిసెలు వేసుకొని రెండేండ్లుగా ఉంటున్నారు.
గుడిసెలను తొలగించేందుకు అటవీ శాఖ, పోలీస్ సిబ్బంది సోమవారం జేసీబీ, డోజర్ను తీసుకొని వెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన గిరిజనులు ఆఫీసర్లపై కారంపొడి చల్లే ప్రయత్నం చేస్తూ కర్రలు, కత్తులతో దాడికి యత్నించారు. ఈ క్రమంలో జేసీబీ అద్దాలు ధ్వంసం కావడంతో పాటు డ్రైవర్కు గాయాలు అయ్యాయి. డ్యూటీలో ఉన్న ఆఫీసర్లపై దాడి చేసిన 10 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్కుమార్ తెలిపారు.