యూట్యూబర్ ​తెచ్చిన తంటా..మేడారంలో వనమూలికలు అమ్ముకునే మహిళ అరెస్టు

యూట్యూబర్ ​తెచ్చిన తంటా..మేడారంలో వనమూలికలు అమ్ముకునే మహిళ అరెస్టు
  •     మేడారంలో వనమూలికలు అమ్ముకునే మహిళతో చిట్ చాట్​
  •     తన వద్ద అటవీ జంతువుల భాగాలున్నాయన్న చెంచు లక్ష్మి 
  •     సోషల్​మీడియాలో వీడియో వైరల్​
  •     అరెస్ట్ చేసిన ఫారెస్ట్​ ఆఫీసర్లు

ములుగు, వెలుగు : మేడారం జాతరలో యూట్యూబర్​కు ఇంటర్వ్యూ ఇచ్చిన మహిళ తన దగ్గర అటవీ జంతువులకు సంబంధించిన వస్తువులు ఉన్నాయని చెప్పింది. దీంతో ఈ వీడియో వైరల్​కావడంతో చూసిన ఫారెస్ట్​ అధికారులు వైల్డ్​ఆనిమల్స్​యాక్ట్​ ఉల్లంఘించారంటూ ఆమెను అరెస్ట్​ చేశారు. ఫారెస్ట్​అధికారుల కథనం ప్రకారం..భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెంచుకాలనీకి చెందిన లక్ష్మి ప్రకృతి వైద్యం చేసేది. మేడారం జాతరలో వనమూళికల షాప్​ పెట్టుకుంది. 

ఓ యూట్యూబర్​వచ్చి లక్ష్మి వద్ద మైక్​పెట్టి వీడియో తీస్తూ ఏ రోగానికి ఏ మందులు ఉన్నాయని అడిగాడు. అన్నింటికీ సమాధానం చెప్పిన లక్ష్మి అత్యుత్సాహంతో తన వద్ద ముంగీస, నక్క తోక, ఇతర జంతువుల చర్మం, గోర్లు, ఇలా అనేక భాగాలున్నాయని చెప్పింది. ఇది తర్వాత యూట్యూబ్​లో అప్​లోడ్​ చేయడంతో వైరల్​అయ్యింది. విషయం కాస్తా ఫారెస్ట్​ ఆఫీసర్ల వరకు వెళ్లడంతో వారు ఎంక్వైరీ చేసి చెంచుకాలనీలోని  లక్ష్మి ఇంటిని సోదా చేశారు. 

అక్కడ వారికి అటవీ జంతువుల అవయవాలు, వస్తువులు దొరకడంతో సీజ్​ చేసిన ములుగు రేంజ్​ ఆఫీసుకు తరలించారు. లక్ష్మిపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. ములుగు డీఎఫ్​వో రాహుల్​కిషన్​జాదవ్​ వైల్డ్​ లైఫ్​అధికారులు, సిబ్బందిని అభినందించారు. కేసును ఫారెస్ట్​మొబైల్​పార్టీకి అప్పగించారు. ఫారెస్ట్​ రేంజర్లు శంకర్​, శీతల్, బీట్​ఆఫీసర్లు చిస్తీ, రవీనా, సీతారాం, వసంత పాల్గొన్నారు.