
మొజంజాహి మార్కెట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మొజంజాహి మార్కెట్ వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమ వేదిక వద్దకు చేరుకోగా.. టీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. హిమంత బిశ్వశర్మ కు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఘన స్వాగతం పలుకుతూ స్టేజీపైకి ఆహ్వానించారు. గణేశ్ ఉత్సవాల విశిష్టతను భక్తులకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు వివరిస్తుండగా.. TRS కార్యకర్త నంద కిషోర్ వ్యాస్ ఆయన మైక్ ను లాక్కున్నారు. ఆ సమయంలో స్టేజీపైనే అసోం సీఎం ఉన్నారు. ఇది సరైన పద్దతి కాదని అక్కడున్నవారు వారించినా వినిపించుకోలేదు. దీంతో పోలీసులు నంద కిషోర్ ను స్టేజ్ పై నుంచి కిందకు తీసుకొచ్చారు. ఇదే టైం లో TRS నేత నందకిషోర్ ను స్టేజ్ వద్ద ఉన్న వారు కొట్టేందుకు ముందుకు వచ్చారు. ఈక్రమంలో పోలీసులు టీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేసి అబిడ్స్ పీఎస్కు తరలించారు.
అంతకుముందు MJM మార్కెట్ దగ్గర ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. అసోం సీఎంకు పోటీగా.. మంత్రి తలసాని ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వారిని గమనించిన భాగ్య నగర్ ఉత్సవ సమితి సభ్యులు.. అక్కడ మంత్రి తలసాని ఫ్లెక్సీని ఏర్పాటు చేయొద్దని కోరారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు, భాగ్య నగర్ ఉత్సవ సమితి సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఎంత వారించినా వినిపించుకోలేదు. ఇరువురి మధ్య గొడవ జరుగుతుండగానే కొందరు మంత్రి తలసాని ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు.
హైదరాబాద్ లో వినాయక శోభయాత్రను చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానని అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ అన్నారు. తెలంగాణ లో కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాలి కానీ.. కుటుంబ పక్షాన ఉండకూడదన్నారు.తెలంగాణ లో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని గణేశుడిని కోరుకున్నానని తెలిపారు.