టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. స్వార్థపూరిత రాజకీయ పార్టీలు : వైఎస్ షర్మిల

 టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. స్వార్థపూరిత రాజకీయ పార్టీలు : వైఎస్ షర్మిల

తెలంగాణలో రైతులకు గౌరవం లేదని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో పాదయాత్రలో పాల్గొన్న వైఎస్ షర్మిలకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పండించిన పంటకి గిట్టు బాటు లేదన్న ఆమె... తాలు తరుగు అని రైతును నిండా ముంచుతున్నరని ఆరోపించారు. 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కౌలు రైతు తెలంగాణలో రైతే కాదు అంటున్నాడని, ఉద్యోగాల పేరుతో 8 ఏళ్లుగా మోసం చేస్తున్నాడని విమర్శించారు. ఉద్యోగాల కోసం సాధించుకున్న తెలంగాణలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని..? అని ప్రశ్నించారు. నోటిఫికేషన్ లు ఇవ్వండిని, ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. కేసీఆర్ లో చలనం లేదని ఆరోపించారు.

బంగారు తెలంగాణ అని చెప్పి ఏ వర్గానికీ బ్రతుకే లేని తెలంగాణగా చేశారని షర్మిల మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్వార్థపూరిత రాజకీయ పార్టీలని ఆరోపించారు. మాట మీద నిలబడే నాయకుడు లేడన్న షర్మిల... వైఎస్సార్ పథకాలు ఖూనీ చేశారన్నారు. వైఎస్సార్ పాలన ఈ గడ్డ పై మళ్ళీ రావాలని కోరారు. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని, వైఎస్సార్ ప్రతీ పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తానని చెప్పారు. వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకువస్తానని స్పష్టం చేశారు.