టీఆర్ఎస్ కండువా కప్పుకున్న వాళ్లకే ఇళ్ల పట్టాలు.. నిన్నమొన్న వచ్చినొళ్లకే మంత్రి పదవులు

టీఆర్ఎస్ కండువా కప్పుకున్న వాళ్లకే ఇళ్ల పట్టాలు.. నిన్నమొన్న వచ్చినొళ్లకే మంత్రి పదవులు

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏళ్లుగా కష్టపడుతున్నా తమకు ఎలాంటి కీలక పదవులు దక్కలేదని.. నిన్నా మొన్నా వచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చాయన్నారు. అయినా తానేమి బాధపడలేదని..కేసీఆర్ కు, పార్టీకి విధేయుడిగా ఉంటూ నమ్మకంగా పనిచేస్తున్నానన్నారు. ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పిందే వేదమని..  టీఆర్ఎస్ కండువా కప్పుకున్న వారికే బాజాప్త డబుల్ బెడ్రూంలు ఇస్తామన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు టిఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు.  జనగామ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్స్ లో జనగామ, నర్మెట్ట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మహబూబాబాద్ ఎంపి కవిత, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలు ప్రారంభించారు. 2001 నుంచి 2014 వరకు తాము చేసిన కృషి ఫలితమే రాష్ట్రంలో కనిపిస్తున్న సంపదని చెప్పారు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని కేసీఆర్ ఉద్యమం నడిపారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఉంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు ముత్తిరెడ్డి.