ఐదు వారాల దాకా యుద్ధమే...ఖమేనీని చంపినందుకు గర్వపడుతున్న: డొనాల్డ్ ట్రంప్  

ఐదు వారాల దాకా యుద్ధమే...ఖమేనీని చంపినందుకు గర్వపడుతున్న: డొనాల్డ్ ట్రంప్  
  • ముందుగా ఖమేనీనే నాపై దాడి చేయాలనుకున్నడు
  • తానే ఆయనపై ఫస్ట్ అటాక్ చేశానని వెల్లడి
  • అధ్యక్ష ఎన్నికల టైంలో తనపై రెండుసార్లు ఇరాన్  హత్యకు యత్నించిందని ఆరోపణ

వాషింగ్టన్: ఇరాన్ తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం 5 వారాల దాకా కొనసాగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  అన్నారు. అయితే, కచ్చితంగా అన్ని వారాలే యుద్ధం జరుగుతుందని చెప్పలేనని, అంతకన్నా ముందే ముగియవచ్చు లేదా తర్వాత కూడా కొనసాగవచ్చని అన్నారు. అమెరికన్  టీవీ చానెల్ ఏబీసీతో సోమవారం ఆయన మాట్లాడారు. ఇరాన్ పై తాము ప్రారంభించిన యుద్ధంలో ఆ దేశ సుప్రీం లీడర్  అయతుల్లా అలీ ఖమేనీతో పాటు చాలా మంది కీలక వ్యక్తులు చనిపోయారని తెలిపారు. యుద్ధం ప్రారంభమైన మొదటి రెండు రోజుల్లోనే వారిని మట్టుబెట్టామని చెప్పారు. 

ప్రస్తుత నాయకత్వం స్థానంలో వేరే వారిని నియమించేందుకు తగిన అభ్యర్థులను గుర్తించామని వెల్లడించారు. ‘‘ఇరాన్ ఫస్ట్  లీడర్, సెకండ్  లీడర్  లేరు. వారంతా చనిపోయారు. ఖమేనీని చంపినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే, గతంలో నాపై రెండుసార్లు ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్  రిపబ్లిక్  హత్యాయత్నం చేసింది. 2024లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న టైంలో నాపై ఆ  అటెంప్ట్  మర్డర్స్  జరిగాయి. అది ఖమేనీ పనే. ముందుగా అతను నన్ను చంపాలని చూశాడు. కానీ, నేనే అతనిని చంపేశాను” అని ట్రంప్  వ్యాఖ్యానించారు.

ముగ్గురు అమెరికన్ సైనికులు మృతి..

ఇరాన్ పై యుద్ధంలో అమెరికాకు మొదటి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్  చేసిన ప్రతిదాడుల్లో ముగ్గురు అమెరికన్  సైనికులు చనిపోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్  కమాండ్ ‘ఎక్స్’ లో కన్ఫమ్  చేసింది. కాగా.. తమ సైనికుల మరణవార్తపై ప్రెసిడెంట్ డొనాల్డ్  ట్రంప్  స్పందించారు. మున్ముందు ఇరాన్​లో పరిస్థితి భయంకరంగా ఉంటుందని, తమ సైనికుల మృతికి ఇరాన్  భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.  

‘‘గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఆ సోల్జర్లు దేశం కోసం  తమ ప్రాణాలు త్యాగం చేశారు. వారు నిజమైన దేశభక్తులు. వారి మరణానికి కచ్చితంగా బదులు తీర్చుకుంటాం” అని ట్రంప్  పేర్కొన్నారు.

మాపై ఇరాన్ దాడి చేస్తుందని ఇంటెలిజెన్స్ సమాచారం లేదు

అమెరికాపై ముందుగా దాడి చేయడానికి ఇరాన్  ప్లాన్  చేసిందని ఇంటెలిజెన్స్  నుంచి ఎలాంటి సమాచారంలేదని ట్రంప్  పాలకవర్గంలోని అధికారులు కాంగ్రెషనల్  స్టాఫ్​కు తెలిపారు. ఆదివారం కాంగ్రెషనల్  స్టాఫ్​తో వారు సమావేశం నిర్వహించారు. పశ్చిమాసియాలో అమెరికా బలగాలకు ఇరాన్  నుంచి ముప్పు ఉందని, ఏ క్షణమైనా అక్కడ యూఎస్  బలగాలపై ఇరాన్  దాడిచేసే ప్రమాదం ఉందని సంకేతాలు అందాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ పై ముందుగా అటాక్  చేయడానికి అధ్యక్షుడు ట్రంప్  ఆదేశించారని వివరించారు. పశ్చిమాసియాలో అమెరికా బలగాలపై దాడిచేయాలని చూస్తే ట్రంప్  ఊరుకోరని హెచ్చరించారు.