
న్యూఢిల్లీ: కెనడా, మెక్సికో, చైనాపై యూఎస్ ప్రభుత్వం టారిఫ్లు వేయనుండడంతో గ్లోబల్ మార్కెట్లతో పాటే ఇండియన్ మార్కెట్ సోమవారం నష్టాల్లో కదిలింది. సెన్సెక్స్ 319 పాయింట్లు (0.41 శాతం) తగ్గి 77,187 వద్ద, నిఫ్టీ 121 పాయింట్లు నష్టపోయి 23,361 వద్ద సెటిలయ్యాయి. 30 షేర్లున్న సెన్సెక్స్లో ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, హిందుస్తాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఎక్కువగా పడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, మారుతి షేర్లు లాభాల్లో ముగిశాయి.
గ్లోబల్గా చూస్తే సౌత్ కొరియా, హాంకాంగ్, జపాన్, యూరప్ మార్కెట్లు భారీగా పడ్డాయి. ట్రంప్ టారిఫ్లతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిందని, రూపాయి విలువ మరింత పడడంతో కూడా మార్కెట్ నష్టపోయిందని మెహతా ఈక్విటీస్ ఎనలిస్ట్ ప్రశాంత్ తాప్సీ అన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల ఒత్తిడి ఇప్పటిలో తగ్గేటట్టు కనిపించడం లేదని పేర్కొన్నారు.