- ప్రగతి నివేదికలు సిద్ధం చేస్తున్న పంచాయతీ సెక్రటరీలు
- 2019 తర్వాతే సకల సౌకర్యాలు వచ్చినట్టుగా రిపోర్టులు!
- ఎన్నికల్లో ప్రచారం కోసమేనని విమర్శలు
హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో సౌలతులపై రాష్ట్ర సర్కార్ సర్వే చేపట్టింది. 32 అంశాలపై పంచాయతీ సెక్రటరీలు, సర్పంచ్ ల ద్వారా ప్రగతి నివేదికలు సిద్ధం చేయిస్తోంది. పల్లె ప్రగతిలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు విడుదలైన నిధులు, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆసరా, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతు బీమా, రైతు బంధు తదితర సంక్షేమ పథకాలవారీగా లబ్ధిదారులు, వారికి మంజూరైన నిధుల లెక్క తీస్తోంది. పల్లె ప్రగతి ద్వారా 2019 నుంచి గ్రామాలకు విడుదలైన నిధులు, సొంతంగా సమకూర్చుకున్న నిధులు, ఇప్పటి వరకు వేసిన బీటీ, సీసీ రోడ్ల వివరాలను ఇందులో ప్రస్తావించింది. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఖర్చు చేసిన నిధుల్లో అత్యధిక ఫండ్స్ కేంద్రం నుంచి వచ్చినవే అయినప్పటికీ.. మొత్తం అభివృద్ధి పనులను రాష్ట్ర సర్కార్ తన ఖాతాలో వేసుకునేందుకు ఈ సర్వే నిర్వహిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
2019 తర్వాత జరిగిన అభివృద్ధిపై ఫోకస్
పల్లె ప్రగతి ప్రారంభమయ్యాక గ్రామాల్లో వచ్చిన మార్పులు, అభివృద్ధిపై ప్రధానంగా ఈ సర్వేలో ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ట్రాక్టర్, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, గ్రామపంచాయతీ భవనం, రైతు వేదిక, సైడ్ డ్రైన్లు, ఇంటర్నల్ సీసీ రోడ్లు, వంగిన/ విరిగిన స్తంభాలను మార్చడం, రోడ్లకు ఇరువైపులా మొక్కలు, ప్రతి ఇంటికి నల్లా నీరు(మిషన్ భగీరథ), నీళ్ల ట్యాంకులు, కరెంట్ సరఫరా తదితర అంశాల్లో 2019కు ముందు ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందనే ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందినవారి వివరాలు కూడా సేకరిస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి(గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రసవాలు), కల్యాణలక్ష్మి/షాదీ ముబారాక్ తదితర పథకాల లబ్ధిదారుల పేర్లు, మంజూరైన నిధుల వివరాలను ఈ సర్వే ఫామ్ లో పొందుపరిచారు. 2018 ఎన్నికల సందర్భంలోనూ సంక్షేమ పథకాల లబ్ధిదారుల లిస్టు ప్రిపేర్ చేసి, ప్రచారంలో వారిని ప్రత్యేకంగా కలిశారని, వచ్చే ఎన్నికల్లోనూ ఇలా కలిసేందుకే లిస్టు రూపొందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అనుకూలమైన ఆన్సర్లతో సర్వే పత్రాలు
సాధారణంగా ఏ సర్వే క్వశ్చనీర్లో అయినా ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఫీల్డ్ లో సర్వే చేసే వ్యక్తులు ప్రజలను అడిగి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సర్కార్పంపిన సర్వే క్వశ్చనీర్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. చాలా ప్రశ్నలకు ముందే సమాధానాలు నింపి ఉండడం గమనార్హం. అనేక దశాబ్దాలుగా గ్రామాలకు రెగ్యులర్ గా కేంద్రం నుంచి నిధులు మంజూరవుతున్నప్పటికీ.. ఇన్నేండ్లు నిధులు సక్రమంగా రాలేదని రిమార్క్ కాలమ్ లో ముందే రాసేశారు. అలాగే ట్రాక్టర్, నర్సరీ, డంపింగ్ యార్డు, స్మశానవాటికలు గతంలో ఏ గ్రామంలో లేవని, 2019 తర్వాతే అవన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథకు ముందు రాష్ట్రంలోని మెజార్టీ గ్రామాల్లో నీళ్ల ట్యాంకులు, ఇంటింటికి నల్లాలు ఉన్నాయి. కానీ అంతకు ముందు ఇవేవి లేవని, మిషన్ భగీరథ వచ్చాకే ఈ సౌకర్యాలు వచ్చినట్లు రాశారు. దీంతో 2019 తర్వాతే గ్రామాల్లో సకల సౌలతులు వచ్చినట్లుగా రిపోర్టులు రెడీ అవుతున్నాయి.