హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లాలో ఓపెన్ ప్లాట్ల వేలానికి టీఎస్ ఐఐసీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని మన్నెగూడ, మునగనూరు, కవాడిపల్లి, శేరిలింగంపల్లి మండలంలోని చందానగర్లో మొత్తం 373 ప్లాట్లను వేలం వేయనున్నట్లు అందులో పేర్కొంది. వచ్చే నెల 12 నుంచి 21 వరకు ఆన్లైన్లో వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మన్నెగూడలో 166 ప్లాట్లు ఉండగా, గజం కనీస ధర రూ.30 వేలుగా ఖరారు చేశారు.
మునగనూరులో 152 ప్లాట్లకు గాను గజం కనీస ధర రూ.20 వేలుగా, కవాడిపల్లిలో 52 ప్లాట్లకు గాను గజం కనీస ధర రూ.10 వేలుగా, చందానగర్ లో 3 ప్లాట్లకు గాను గజం కనీస ధర రూ.40 వేలుగా నిర్ధారించారు. వేలంలో పాల్గొనే వారు మన్నెగూడ, మునగనూరులోని ప్లాట్లకు రూ.లక్ష చొప్పున, కవాడిపల్లిలోని ప్లాట్లకు రూ.50 వేలు, చందానగర్లోని ప్లాట్లకు రూ.3లక్షలు డిపాజిట్ చెల్లించాలని టీఎస్ ఐఐసీ పేర్కొంది.