త్వరలో గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్!

త్వరలో గ్రూప్ 1  సప్లిమెంటరీ నోటిఫికేషన్!
  • త్వరలో గ్రూప్ 1  సప్లిమెంటరీ నోటిఫికేషన్! 
  • కనీసం వంద పోస్టులు కలిపే యోచనలో సర్కారు
  • కొత్త పోస్టులకు క్లియరెన్స్ రాగానే టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ 
  • ఇదే సమయంలో సుప్రీంకోర్టులోని కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 పోస్టుల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు, టీఎస్​పీఎస్సీ చర్యలు మొదలుపెట్టాయి. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి, వాటి భర్తీకి ఏర్పాట్లు చేయాలని టీఎస్​పీఎస్సీ యోచిస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1 పోస్టుల ఖాళీల వివరాలను ఆర్థికశాఖ కోరగా.. అన్ని డిపార్ట్ మెంట్లలో కేవలం 43 మాత్రమే ఖాళీగా ఉన్నాయనే లెక్కలు వచ్చాయి. మరో 23 పోస్టుల భర్తీపై వివాదాలుండటంతో, ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ భావిస్తోంది. దీనికితోడు రానున్న ఆరు నెలల్లో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలనూ సేకరించాలని యోచిస్తున్నారు.

కనీసం వంద పోస్టులనైనా కలపాలనే భావనలో ఉన్నారు. పోస్టుల వివరాలను ఫైనాన్స్ శాఖ అందించగానే, సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే టీఎస్​ పీఎస్సీ చేస్తోంది. ప్రస్తుతం కొత్త కమిషన్ సమావేశం నిర్వహించి, ఈ నిర్ణయాలు తీసుకోవాలని యోచిస్తున్నారు. అయితే, ప్రభుత్వం చైర్మన్ తో పాటు ఐదుగురు సభ్యులను నియమిస్తే, దీంట్లో ఇద్దరు సభ్యులు ఇంకా జాయిన్ కాలేదు. మరో సభ్యురాలు సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కమిషన్ సమావేశం ఆలస్యమవుతుందని తెలుస్తోంది. మరో వారంలో సమావేశం నిర్వహించి, దాంట్లో కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. 

కొత్త పోస్టులు కొత్తోళ్లకే చాన్స్!

ప్రస్తుతమున్న పోస్టులకు మరిన్ని పోస్టులు కలిపి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్​పీఎస్పీ యోచిస్తోంది. ఈ క్రమంలో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు గతంలో అప్లై చేసిన వారితో పాటు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. అయితే, కొత్తగా అప్లై చేసే వారు మాత్రం కొత్త పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండే అవకాశం ఉందనే వాదనలూ ఉన్నాయి. గతంలో గ్రూప్ 2కు ఇలాగే చేసినట్టు టీఎస్​పీఎస్సీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ ఈ నిబంధనను మార్చాలనుకుంటే సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 

సుప్రీంకోర్టు నుంచి కేసు వెనక్కి!

గతంలో 503 పోస్టులతో గ్రూప్1 నోటిఫికేషన్  వేశారు. వీటి భర్తీ కోసం రెండు సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించగా, వివిధ కారణాలతో రెండు సార్లూ రద్దయ్యాయి. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించలేదనే వాదనతో హైకోర్టు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్​ రద్దు చేయగా, దానిపై అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఆదేశాలతో టీఎస్​పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం దీనిపై కేవియెట్ పిటిషన్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ముందుకు పోతే, తీర్పు రావడం ఆలస్యమైతే ఎలా అనే ఆందోళన కమిషన్ లో నెలకొన్నది. ఈ నేపథ్యంలో కేసును విత్ డ్రా చేసుకొని, మళ్లీ పరీక్ష పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.