టీఎస్ ఆర్టీసీ అలెర్ట్: హైదరాబాద్-విజయవాడ హైవే బంద్

టీఎస్ ఆర్టీసీ అలెర్ట్:  హైదరాబాద్-విజయవాడ హైవే బంద్

వరద బీభత్సం.. హైదరాబాద్-విజయవాడ మార్గంలో బస్సులు రద్దు..
ప్రత్యామ్నాయ మార్గాల్లో అందుబాటులోకి బస్సులు
కీసర మధ్య మున్నేరు వాగు ఉధృతి

తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్-విజయవాడ హైవేపై వరద ప్రవహిస్తోంది. దీని ప్రభావంతో రోడ్డును మూసివేసిన అధికారులు.. వేరే మార్గంలో వాహనాలను పంపిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్-విజయవాడ రెగ్యులర్ బస్సులను టీఎస్‌ఆర్టీసీ రద్దు చేసింది.

వర్షపు నీరు చేరుకోవడంతో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్‌ సమీపంలోని ఐతవరం వద్ద హైవేపై మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణాలు పూర్తిగా ఆగిపోయాయి. రోడ్లపైకి భారీగా నీళ్లు చేరుకోవడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ మీదుగా అధికారులు దారి మళ్లిస్తున్నారు.

వేరే మార్గంలో వాహనాలను మళ్లిస్తుండటం, వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కోదాడ-హుజూర్‌నగర్ రహదారిపై ఏకంగా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఐతవరం సమీపంలో మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బస్సు సర్వీసుల విషయంలో ప్రయాణికులను అలర్ట్ చేస్తుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండి సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో సజ్జనార్ హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రభావం గురించి పేర్కొన్నారు.  

మున్నేరు వాగు వరద ఉధృతితో కీసర టోల్‌గేట్ దగ్గర గురువారం (జులై 27)సాయంత్రం నుంచే వాహనాలను అధికారులు ఆపేశారు. మున్నేరు వాగుకు ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి చేరుకుంటోంది. నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశహుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాహనాలను నిలిపివేసి ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో కీసర వద్ద చాలా వాహనాలు అలాగే నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.

ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో రోజూ తిప్పే రెగ్యులర్ బస్సులను రద్దు చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. విజయవాడ వెళ్లేవారి కోసం హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ నుంచి బయలుదేరుతుందని, ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సజ్జనార్ తెలిపారు.  . మరింత సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.