
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.21.73 కోట్లను మోసం చేసిన కేసులో ‘గో రూరల్ ఇండియా’ సంస్థ నిర్వాహకుడు వి.సునీల్ అరెస్ట్ కావడం సరైనదేనని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రకటనల కోసం ఆర్టీసీతో అగ్రిమెంట్లు చేసుకొని వాటిని ఉల్లంఘించి బకాయిలను ఎగవేశారని చెప్పారు. అలాంటి సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని శనివారం ఒక ప్రకటనలో ఎండీ హెచ్చరించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలో తిరిగే మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డిలక్స్ బస్సుల్లో ప్రకటనల కోసం గో రూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీ 2015లో ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆరేండ్లకుగాను 2021 సెప్టెంబర్ వరకు అగ్రిమెంట్ కుదిరిందన్నారు.
ఆ ఒప్పందం ప్రకారం సకాలంలో లైసెన్స్ ఫీజును ఆ సంస్థ చెల్లించలేదు. హైదరాబాద్ రీజియన్ లో రూ.10.75 కోట్లు, సికింద్రాబాద్ రీజియన్ లో రూ.10.98 కోట్లు బకాయిలున్నాయి. నోటీసులు ఇచ్చిన కట్టలేదని, వారు ఇచ్చిన చెక్ లు చెల్లలేదని ఎండీ తెలిపారు. ఈ మోసంపై అప్జల్ గంజ్, మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశామని ఎండీ పేర్కొన్నారు.