
సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఆదివారం చంద్రగ్రహణం కారణంగా వీఐపీ దర్శన సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్లు తెలిపింది టీటీడీ. చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3:30 గంటల నుంచి 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న సంగతి తెలిసిందే.ఈ కారణంగా సెప్టెంబర్ 8వ తేదీ దర్శనం కొరకు 7వ తేది వీఐపీ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ.
సెప్టెంబర్ 8వ తేది నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించనున్నట్లు తెలిపింది టీటీడీ. అదేవిధంగా 7వ తేదిన శ్రీవాణి ఆఫ్ లైన్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం 1 గంటకు మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 16వ తేదిన శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా సెప్టెంబర్ 15వ తేదీ కూడా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపింది టీటీడీ. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు సహకరించాలని కోరింది టీటీడీ.