శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం కాలేదు: వైవీ సుబ్బారెడ్డి

శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం కాలేదు: వైవీ సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవాణి ట్రస్ట్‌ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ వస్తున్నవార్తలపై టీటీడీ ధర్మకర్తల మండలి స్పందించింది. నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం జరిగింది. సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించడం కోసం శ్రీవాణి ట్రస్ట్‌ను ప్రారంభించామన్న వైవీ సుబ్బారెడ్డి.. ఈ నిధులతో రాష్ట్రంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో 2445 ఆలయాలు నిర్మించామని వెల్లడించారు.

"దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించడం కోసం 2019లో టీటీడీ శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేశాం. ఈ నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాలతోపాటు తెలంగాణ, పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని గిరిజన, ఎస్పీ, మత్స్యకార గ్రామాల్లో మొత్తం 2,445 ఆలయాల నిర్మాణం జరుగుతోంది. ట్రస్ట్ నిధులతో పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు ఆర్థికసాయం అందిస్తున్నాం. అందుకు సంబంధించి  పాలకమండలి..  టీటీడీ ఆస్తులపై  2021 జూన్‌ 21వ తేదీన, బంగారు,నగదు డిపాజిట్లపై 2022 నవంబరు 5వ తేదీన శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది."

" శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేకంగా బ్యాంకు అకౌంటు ఉంది. అందులోనే విరాళాలు జమ అవుతాయి. టీటీడీ నుండి ఒక రూపాయి కూడా పక్కదారి పట్టే ప్రసక్తే లేదు. శ్రీవాణితో పాటు ఇతర ఏ ట్రస్టుల్లో అయినా అవినీతి జరుగుతోందనే అనుమానం ఉంటే ఎవరైనా వివరాలు తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 300 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ విషయం పై 2023 జనవరి 23వ తేదీ ఈవో  శ్రీ ఎవి ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి శ్రీవాణి ట్రస్ట్ నిధులు.. ఈ నిధులతో నిర్మించిన, నిర్మిస్తున్న, నిర్మించబోయే ఆలయాల వివరాలు పూర్తిగా వివరించారు. అయినా కొందరు పదే పదే ఆరోపణలు చేయడం శోచనీయం." 

"శ్రీవాణి టికెట్‌ తీసుకునే భక్తులకు ట్రస్టుకు విరాళం కింద రూ.10 వేలకు, దర్శనం టికెట్‌ కోసం రూ.500కు రెండు రసీదులు ఇస్తున్నాం. ఆన్‌లైన్‌లో ఈ టికెట్‌ బుక్‌ చేసుకున్నా రెండు రసీదులు వస్తాయి. రూ.500కు మాత్రమే రసీదు ఇచ్చి మిగిలిన రూ.10 వేలు దోచుకుంటున్నారని కొందరు వ్యక్తులు రాజకీయ, వ్యక్తిగత లబ్ధి కోసం ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం.." అని వైవి.సుబ్బారెడ్డి ఈవోతో కలిసి మీడియాకు వివరించారు.