పురాతన ప్రాశస్థ్యం ఉన్న ఒంటిమిట్ట ఆలయానికి వచ్చే 50 ఏళ్ళ వరకు సరిపడేలా పూర్తిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో ఛాంబర్ లో నిర్వహించిన సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. వచ్చే 50 ఏళ్ళ నాటికి భక్తులు రోజుకు ఎంతమంది రావచ్చు, ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి, భక్తులకు సరిపడేలా మౌలిక సదుపాయాలు, వసతులు వంటి అంశాలను దృష్టిల్కొ ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు ఈవో.
భక్తుల సౌకర్యార్థం కల్యాణకట్ట, పుష్కరిణి, నక్షత్ర వనాలు, గార్డెనింగ్, పచ్చదనం, ఆధ్యాత్మిక చిహ్నాలు, శ్రీ కోదండరామ స్వామి ప్రాశస్థ్యం నవతరానికి అందించేలా మ్యూజియమ్, ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
సాంకేతికతను జోడించి డిజిటల్ స్క్రీన్స్, హనుమంతుడి సేవా నిరతి, సాంస్కృతిక కళామందిరం, లైటింగ్, తోరణాలు, చెరువులో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహాం, నాలుగు మాడ వీధుల అభివృద్ధి, సిసి కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని సూచించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.
ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సంబంధించి టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ అన్నదానం, గార్డెనింగ్, ఎలక్ట్రిక్ తదితర శాఖల అధికారులను భాగస్వామ్యం చేసి ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు ఈవో.
