
టీటీడీ సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. గదిలో మరిచిపోయిన నగదు తిరిగి భక్తురాలికి అప్పగించారు టీటీడీ సిబ్బంది. గురువారం (ఆగస్ట్ 7) శ్రీవారి దర్శనానికి వచ్చిన శ్రీ మధు శాలిని అనే భక్తురాలు తిరుమలలోని ఆదిత్య బిర్లా విశ్రాంతి గృహంలో బ్యాగ్ మరిచిపోయారు. బ్యాగులో రూ.39 వేల నగదు, 600 డాలర్లు, యాపిల్ స్మార్ట్ వాచ్, వాలెట్ ఉన్నాయి. బ్యాగ్ పోయిన విషయాన్ని టీటీడీ అధికారులకు తెలియజేసింది మధు శాలిని.
భక్తురాలి బ్యాగును ఆదిత్య బిర్లా విశ్రాంతి గృహంలో గుర్తించిన టీటీడీ సిబ్బంది తిరిగి ఆమెకు అప్పగించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సదరు భక్తురాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా భక్తులకు కీలక సూచనలు చేశారు టీటీడీ సిబ్బంది. రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి విచారణ కార్యాలయం సూపరింటెండెంట్ శ్రీ విజయ కుమార్, మేనేజర్ శ్రీ శ్రీనివాసులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.