తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ నెల దర్శన టికెట్లు, గదుల వివరాలను టీటీడీ వెల్లడించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత , సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు మార్చి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
ఏ టికెట్లు ఎపుడంటే..?
- కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను మార్చి 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
- వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
- అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను మార్చి 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
- శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను మార్చి 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
- వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
