మార్చి 24, 25న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి

మార్చి 24, 25న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి

తిరుమల శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థాల్లో ఒకటైన తుంబురు తీర్థముక్కోటికి ఉత్సవాన్ని 2024 మార్చి 24, 25వ తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా తుంబురు తీర్థానికి మార్చి 2024 24వ తేదీ ఉదయం 5 నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు, మ‌ళ్లీ మ‌రుస‌టి రోజైన మార్చి 25వ తేదీన ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీరు అందిస్తారు. 

ప్రథ‌మ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు. తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సింది వస్తుంది కావున గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదని టీటీడీ వెల్లడించింది. భ‌క్తులు వంట సామగ్రి, క‌ర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
       
పోలీసుశాఖ, అటవీశాఖ, టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుంచి తుంబురు తీర్థం వరకు చేపట్టనున్నారు. అక్కడక్కడ భద్రతా సిబ్బందిని ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ఫాల్గుణ మాసంలో ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన తీర్థస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.