
6న హైదరాబాద్కు పెద్ద సంఖ్యలో కార్ల బుకింగ్
అదే రోజు కాంగ్రెస్లో చేరొచ్చని ప్రచారం
ఖమ్మం, వెలుగు: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చారు. తాను కాంగ్రెస్లో చేరబోతున్నాననేలా తనను కలిసిన అనుచరులకు హింట్ ఇచ్చారు. తుమ్మల సొంతూరు దమ్మపేట మండలం గండుగులపల్లిలో మంగళవారం పాలేరు నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు ఆయనను కలిసి సంఘీభావం తెలిపారు. పాలేరు టికెట్ ఇవ్వకపోవడాన్ని తన జీవితంలోనే ఘోర అవమానంగా భావిస్తున్నట్లు వారి వద్ద ఆయన వాపోయినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో తుమ్మల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడం లాంఛనమేనని ఆయన ఆనుచరులు అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల మొదటి వారంలో తుమ్మలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. తర్వాత ఢిల్లీ పెద్దల సమక్షంలో చేరిక ఉంటుందని చెప్తున్నారు. వచ్చే నెల 6న కాంగ్రెస్లో తుమ్మల చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతున్నది. ఈ వాదనకు బలమిస్తూ తుమ్మల అనుచరులు 6న హైదరాబాద్కు భారీ సంఖ్యలో వెహికల్స్ బుక్ చేస్తున్నారు. ఇప్పటికే పలు ట్రావెల్ కంపెనీల వద్ద కార్లు బుక్చేసి అడ్వాన్స్ చెల్లించారు.
బీఆర్ఎస్ బుజ్జగింపులు?
తుమ్మలకు రాజ్యసభ సీటుగానీ, ఎమ్మెల్సీ అవకాశంగానీ ఇస్తామని బీఆర్ఎస్ పెద్దలు బుజ్జగిస్తున్నారన్న ప్రచారం సాగుతున్నది. అయితే ఇదంతా నిజం కాదని, ఈ ప్రచారం బీఆర్ఎస్ గేమ్ ప్లాన్లో భాగమని తుమ్మల వర్గీయులు కొట్టిపారేస్తున్నారు. తుమ్మల బీఆర్ఎస్లో కొనసాగే ఆలోచనతో లేరంటున్నారు. బీఆర్ఎస్ కూడా తుమ్మల పార్టీ మారితే జరిగే నష్టంపై అంచనాలు వేస్తున్నదే తప్ప ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించడంలేదని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ఒక్క సీటే గెలిచిందని, ఇప్పుడు అంతకు మించిన నష్టం ఏమీ ఉండదని కేసీఆర్ భావిస్తున్నట్టు చర్చ సాగుతున్నది.
ఖమ్మమా? పాలేరా?
తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని తుమ్మల చెప్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ లిస్ట్ ప్రకటించిన తర్వాత కూడా ఆయన అదే మాటపై ఉన్నారు. అయితే కాంగ్రెస్లో చేరితే ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ ముఖ్య నేతలు ఆయనకు సూచించనున్నట్టు తెలుస్తున్నది. పాలేరు నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలేరు నుంచి పోటీకి పొంగులేటి సిద్ధంగా ఉన్నా, తుమ్మల మాత్రం ఖమ్మం నుంచి పోటీకి రెడీగా లేరని అంటున్నారు. మరోవైపు వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో విలీనమైతే షర్మిల కూడా పాలేరు సీటు కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. అందుకే తుమ్మలకు ఖమ్మం సీటు ఆఫర్ చేయడానికి కారణమన్న చర్చ నడుస్తున్నది.