- వాష్రూమ్లో ఉరేసుకున్న తునీషా
- మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసైలో ఘటన
- నటి మృతిపై అనుమానాలు..
- యాక్టర్ షీజాన్ అరెస్టు
ముంబై: ఇరవై ఏండ్ల యువ నటి.. ఎప్పటిలానే షూటింగ్కు వచ్చింది.. టీ బ్రేక్ సమయంలో వాష్రూమ్కు వెళ్లింది.. కానీ ఎంతకీ తిరిగి రాలేదు.. ఏం జరిగిందోనని డోర్లు పగులగొట్టి చూస్తే.. ఉరికి వేలాడుతూ కనిపించింది. సినిమా, టీవీ నటి తునీషా శర్మ శనివారం అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ ఘటన ముంబై సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఆత్మహత్య అని చెబుతున్నా.. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తునీషా తల్లి ఫిర్యాదుతో నటుడు షీజాన్ మొహమ్మద్ ఖాన్ను పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. కోర్టు అతడికి 4 రోజుల పోలీసు కస్టడీ విధించింది.
అసలేం జరిగింది?
పలు సినిమాలు, సీరియల్స్లో నటించిన తునీషా శర్మ.. ప్రస్తుతం ‘ఆలీ బాబా: దాస్తాన్ ఈ కాబుల్’ అనే షోలో షీజాన్ మొహమ్మద్ ఖాన్తో కలిసి మెయిన్ రోల్లో నటిస్తున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసైలో శనివారం షూటింగ్కు వెళ్లిన ఆమె.. టీ బ్రేక్ టైంలో వాష్రూమ్కు వెళ్లారు. కానీ ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. డోర్లు బద్ధలు కొట్టి చూడగా.. ఉరి వేలాడుతూ తునీషా కనిపించారని పోలీసులు చెప్పారు. హాస్పిటల్కు తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని పేర్కొన్నారు. సూసైడ్ స్పాట్లో తమకు ఎలాంటి నోట్ దొరకలేదని తెలిపారు.
బ్రేకప్ ఒత్తిడితోనే?
తునీషా, షీజాన్ మొహమ్మద్ రిలేషన్షిప్లో ఉన్నారని, 15 రోజుల కిందట ఇద్దరికీ బ్రేకప్ జరిగిందని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తునీషా ఒత్తిడిలో ఉన్నారని, అదే ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తునీషా డెడ్బాడీకి ఆదివారం పోస్ట్మార్టం చేయగా.. ఆమె ఊపిరాడక చనిపోయిందని దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
లవ్ జిహాదేనా?: బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్
తునీషా కుటుంబానికి న్యాయం జరగాలని, తప్పు చేసినోళ్లను వదలొద్దని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ అన్నారు. ‘‘ఆత్మహత్యకు కారణమేంటి? ఇందులో లవ్ జీహాద్ కోణం ఉందా? ఇంకేమైనా కారణమా? దర్యాప్తులో నిజాలు బయటపడుతాయి. ఒకవేళ లవ్ జీహాద్ కేసుగా తేలితే.. దాని వెనుక ఏయే సంస్థలు ఉన్నాయనేది తేల్చాలి” అని డిమాండ్ చేశారు.