
- ఆదిలాబాద్లో కొత్త తరహా మోసానికి తెరలేపిన వ్యాపారులు
- 79 క్వింటాళ్ల పీడీఎస్రైస్ పట్టుకున్న పోలీసులు.. ముగ్గురిపై కేసు, ఇద్దరు అరెస్టు
ఆదిలాబాద్, వెలుగు: బ్రాండెడ్ కంపెనీ బ్యాగుల్లో రేషన్ బియ్యం నింపి అమ్ముతున్న వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ ఏరియాలో ఉన్న రజిత కిరాణా, ఆంధ్ర కిరాణా షాపుల్లో తనిఖీలు చేపట్టారు. రెండు దుకాణాల్లో 79 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. బ్రాండెడ్ పేర్లతో ఉన్న సంచుల్లో రేషన్ బియ్యాన్ని నింపి, అధిక ధరలకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితులైన గూగుల్వార్ రాజేశ్వర్, షేక్ అయ్యూబ్ లను పోలీసులు అరెస్ట్ చేయగా, షేక్ అస్లాం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని ఎస్పీ పరశీలించారు. ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తున్న సబ్సిడీ బియ్యాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జైశ్రీరామ్, గోల్డెన్ సైకిల్ బ్రాండ్, సూర్యతేజ, మధురం, దీపం, గీతాంజలి, వైట్ ప్లాటినం, శ్రీ దత్త అనే పేర్లతో ఉన్న బ్రాండెడ్ బ్యాగులను తయారు చేసి, అందులో పీడీఎస్ బియ్యం నింపి, మెషీన్ తో సీల్ వేసి అధిక ధరలకు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ జీవన్ రెడ్డి, సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్సై అశోక్ ఉన్నారు.