- డీఆర్ఐ డెకాయ్ ఆపరేషన్లో ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: పులి గోర్లు, దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద ఏడు పులిగోర్లు, మూడు పులి దంతాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందిన సెంట్రల్–I సెక్షన్ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కు అప్పగించారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి చంచల్గూడ జైలులో రిమాండ్కు తరలించారు. ఈ మేరకు డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
డీఆర్ఐ డెకాయ్ ఆపరేషన్ ఇలా..
ఓ ముఠా పులులు సహా వన్యప్రాణుల అవశేషాలను దేశవ్యాప్తంగా స్మగ్లింగ్ చేస్తున్నట్లు కేంద్ర డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు డీఆర్ఐ ఇంటెలిజెన్స్ వింగ్ వివరాలు సేకరించింది. కేరళ అడవుల నుంచి పులుల గోర్లు, దంతాలు సేకరించి హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నట్లు గుర్తించింది. స్మగ్లర్లను పట్టుకునేందుకు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా డీఆర్ఐ అధికారులే కొనుగోలుదారులుగా నటిస్తూ ఇద్దరు స్మగ్లర్లను ట్రాప్ చేశారు. ఈ క్రమంలో స్మగ్లర్లు ఇద్దరూ హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని ఏషియన్ ఇంటర్నేషనల్ హోటల్లో బస చేశారు.
సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు హోటల్లో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అమ్మకానికి తెచ్చిన పులిగోర్లు, దంతాలు సీజ్ చేసుకున్నారు. కేరళకు చెందిన జకరియా అనే వ్యక్తి నుంచి పులి గోర్లు, దంతాలు సేకరించినట్లు గుర్తించారు. వన్యప్రాణి అవశేషాల మూలాన్ని గుర్తించేందుకు ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం కేరళ అటవీ శాఖకు అధికారులు పంపించారు.
