బెట్టింగ్ లో రికవరీలో వచ్చిన బంగారంతో పాటు రివాల్వర్ ను తాకట్టు పెట్టిన అంబర్ పేట ఎస్ఐ భాను ప్రకాష్ పై రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. రికవరీ చేసిన బంగారం తాకట్టు పెట్టినందుకు ఒక కేసు సర్వీస్ రివాల్వర్ ను తాకట్టు పెట్టినందుకు మరో కేసు నమోదు చేశారు అంబర్ పేట పోలీసులు . బెట్టింగ్ యాప్ లో అరెస్ట్ అయిన ఎస్ఐ భాను ప్రకాశ్ ప్రస్తుతం ఈస్ట్ జోన్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
బెట్టింగ్ యాప్స్కు బానిసగా మారి..
భానుప్రకాశ్ సరదాగా యాప్స్లో బెట్టింగ్ ఆడడం మొదలుపెట్టాడు. రూ.100, రూ.200, రూ. 500 కాస్తా.. రాను రాను రూ. వేలు, లక్షల్లోకి వెళ్లింది. దీంతో తన జీతంతో పాటు అప్పులు చేసి బెట్టింగ్యాప్స్లో పెట్టడం మొదలుపెట్టాడు. ఆ డబ్బులు కూడా పోవడంతో బెట్టింగ్కు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. దీంతో దొంగతనం కేసులో రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టాడు. ఆ డబ్బులు కూడా బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. ఇలా రూ.70 లక్షల నుంచి రూ. 80 లక్షలు కోల్పోయాడు.
రివాల్వర్ పోతే పోనియ్ అనుకొని..
బెట్టింగ్లో డబ్బులు పోయి అప్పుల పాలైన ఎస్సై భానుప్రకాశ్కు ఎవ్వరూ ఒక్క రూపాయి ఇవ్వడానికి ముందుకు రాలేదు. దగ్గరి బంధువులు, దూరపు చుట్టాలు, స్నేహితుల దగ్గర వదలకుండా అప్పు చేసిన భానుప్రకాశ్..తాకట్టు పెట్టడానికి కూడా ఏమీ లేకపోవడంతో తట్టుకోలేకపోయాడు. చివరకు తన సర్వీస్రివాల్వర్(9 ఎంఎం) ను తనకు తెలిసిన వ్యక్తి దగ్గర కుదువపెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. బుల్లెట్స్ మాత్రం తీసి భానుప్రకాశ్ తన దగ్గరే పెట్టుకున్నాడు.
సస్పెన్షన్.. విచారణ
టాస్క్ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో విచారించగా తన రివాల్వర్ను తాకట్టు పెట్టినట్టు భానుప్రకాశ్ అంగీకరించాడు. దీంతో షాక్కు గురైన టాస్క్ఫోర్స్పోలీసులు.. బంగారం గురించి ఆరా తీశారు. దాన్ని కూడా తనఖా పెట్టినట్టు చెప్పాడు. దీంతో వారు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయగా.. భానుప్రకాశ్పై సస్పెన్షన్ వేటు వేశారు.
