బాలికలపై లైంగిక దాడి కేసుల్లో ఇద్దరికి 20 ఏండ్ల జైలు

బాలికలపై లైంగిక దాడి కేసుల్లో ఇద్దరికి 20 ఏండ్ల జైలు

మెదక్ టౌన్ / ఓల్డ్ సిటీ, వెలుగు: బాలికలపై లైంగిక దాడి కేసుల్లో ఇద్దరు నిందితులకు ప్రత్యేక కోర్టులు 20 ఏండ్ల జైలు శిక్ష విధించాయి. ఉత్తరప్రదేశ్‌‌‌‌కు చెందిన రాజ్‌‌‌‌కిశోర్ మెదక్​ జిల్లా మనోహరాబాద్ మండలంలో అద్దెకు ఉంటూ కూలీ పనులు చేసేవాడు. ఇంటి యజమాని కుమార్తె(15)తో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో నమ్మించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అనంతరం బాలికను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను సురక్షితంగా తీసుకొచ్చారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ మెదక్ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం.శుభవల్లి సోమవారం తీర్పు చెప్పారు.

పహాడీషరీఫ్‌‌‌‌లో..

ఓల్డ్​సిటీలోని పహాడీషరీఫ్ పోలీస్​స్టేషన్​ పరిధిలోని రావిర్యాల గ్రామం దేవేందర్ నగర్ కాలనీకి చెందిన ఓ మైనర్ పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన జడ్చర్ల హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సాదంగి వెంకటేశ్​అలియాస్ సాధుల వెంకటేశ్​ను దోషిగా నిర్ధారిస్తూ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. 2020 ఫిబ్రవరిలో ఈ ఘటన జరిగినట్లు ఇన్‌‌‌‌స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు.