గచ్చిబౌలి, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు యువకులు ఉస్మానియాలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. ఈ ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రంలోని చరైడియా జిల్లా లఖురాఖన్ గ్రామానికి చెందిన జాదు ఫుకోన్(25), బికాశ్ బోరా(22) సిటీకి వచ్చి గచ్చిబౌలి పరిధి గోపన్ పల్లిలో ఉంటున్నారు.
క్యూసిటీ సమీపంలోని హిరాన్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీలో వీరిద్దరు పనిచేస్తున్నారు. ఈ నెల 16న అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటలకు డ్యూటీ అయిపోయిన తర్వాత వీరిద్దరూ స్కూటీపై రూమ్కు బయలుదేరారు. గౌలిదొడ్డిలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద స్కూటీ అదుపుతప్పడంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు.
తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు వారిని ఉస్మానియాకు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఈ నెల 18న జాదు చనిపోగా.. బుధవారం బికాశ్బోరా మృతి చెందాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపారు.