త్వరలో సిటీ నుంచి  రెండు ఐపీఓలు

త్వరలో సిటీ నుంచి  రెండు ఐపీఓలు

హైదరాబాద్​, వెలుగు: మన సిటీ నుంచి త్వరలో రెండు కంపెనీలు ఐపీఓలకు రాబోతున్నాయి. ఒక కంపెనీ కన్జూమర్​ డ్యూరబుల్​ రిటెయిల్​ చెయిన్​ నిర్వహిస్తుండగా, మరో కంపెనీ స్టీల్​ ప్రొడక్టులు తయారు చేస్తోంది. బజాజ్​ ఎలక్ట్రానిక్స్ పేరిట రిటెయిల్​ చెయిన్​ నడుపుతున్న ఎలక్ట్రానిక్స్​ మార్ట్​ ఇండియా రూ. 500 కోట్ల సమీకరణకు, స్టీల్​ కంపెనీ హరిఓం పైప్​ రూ. 120 కోట్ల సమీకరణకు ఐపీఓల కోసం సెబీ వద్ద ప్రాస్పెక్టస్​ ఫైల్​ చేశాయి. 7.5 లక్షల చదరపు అడుగు విస్తీర్ణంలో రిటెయిల్​ స్టోర్సు ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్​ మార్ట్​ దేశంలోనే 4వ ప్లేస్​లో ఉన్నానని చెబుతోంది. కోటి మంది కస్టమర్లకు కన్జూమర్​ డ్యూరబుల్స్​ అమ్మామని, 2,600 మంది ఉద్యోగులున్నారని పేర్కొంటోంది. ఆంధ్ర ప్రదేశ్​, తెలంగాణలలో మరిన్ని స్టోర్లు ఏర్పాటు చేయడంతోపాటు, ఎన్​సీఆర్​ రీజియన్​లో అడుగుపెట్టాలనుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. కిందటేడాది రూ. 3,207 కోట్ల టర్నోవర్​ సాధించినట్లు తెలిపింది. మరోవైపు స్టీల్​ రంగంలోని హరిఓం పైప్​ సంగారెడ్డి వద్ద కొత్త ప్లాంట్​ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త ప్లాంటుకు ఏడాదికి 51,493 టన్నుల కెపాసిటీ ఉంటుందని, ఇప్పటికే ఉన్న కెపాసిటీ 2.41 లక్షల టన్నులని తెలిపింది. కంపెనీ టర్నోవర్​ కిందటేడాది రూ. 255 కోట్లు.