- జల ప్రళయం సంభవించిన ప్రాంతంలోనే ఏర్పడినయ్
- ఒకటి 47 ఎకరాలు.. మరోటి 27 ఎకరాల్లో విస్తరణ
- శాటిలైట్ ద్వారా గుర్తించిన హైదరాబాద్ సైంటిస్టులు
- అవి తెగితే మళ్లీ వరదలు ముంచెత్తే ప్రమాదం
హైదరాబాద్, వెలుగు: నేపాల్లో మరో రెండు బారియర్ లేక్లు ఏర్పడ్డాయి. టిబెట్, నేపాల్ బార్డర్లోని లాంగ్టాంగ్ లిరుంగ్ పర్వత శ్రేణుల్లో భారీ మంచుకొండ విరిగి, నదీ ప్రవాహానికి అడ్డుగా పడటంతో బారియర్ లేక్ ఏర్పడి.. అది సడెన్గా తెగడం వల్లే వరదలు ముంచెత్తాయి. అయితే, అక్కడ మంచుకొండ విరిగిపడడం వల్ల నీటి ప్రవాహ మార్గాలు మూసుకుపోయి మరో రెండు కొత్త సరస్సులు పుట్టుకొచ్చినట్టు హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ) సైంటిస్టులు గుర్తించారు.
అవి తెగిపోతే మళ్లీ మెరుపు వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నేపాల్ విపత్తును అంచనా వేసేందుకు సైంటిస్టులు ఇస్రోకు చెందిన కార్టోశాట్-3 ఉపగ్రహం.. శుక్రవారం తీసిన హై-రిజల్యూషన్ చిత్రాలను, ప్రమాదానికి ముందు తీసిన చిత్రాలతో పోల్చారు. రెండు వేర్వేరు చోట్ల కొత్తగా జలాశయాలు ఏర్పడినట్లు నిర్ధారించారు.
మళ్లీ వరదల ముప్పు..
ఎన్ఆఆర్ఎస్సీ విశ్లేషణ ప్రకారం.. ఆ రెండు ప్రాంతాల్లో 30 హెక్టార్ల మేర సరస్సులు ఏర్పడినట్టు చెబుతున్నారు. హిమపాతం సంభవించిన ప్రాంతానికి అతి సమీపంలోనే లోతట్టు భాగంలో తొలి సరస్సు ఏర్పడినట్టు తేల్చారు. అది 623 మీటర్ల పొడవు.. 450 మీటర్ల వెడల్పుతో 47 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్టు నిర్ధారించారు. ఇక, రెండోది నదీ సంగమ ప్రాంతానికి సమీపంలో ఏర్పడింది. ఇది 944 మీటర్ల పొడవు.. 236 మీటర్ల వెడల్పుతో 27 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్టు గుర్తించారు.
ఇలా తాత్కాలికంగా ఏర్పడే మంచు-రాళ్ల ఆనకట్టలు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాలకు నీటి ఒత్తిడి పెరిగి ఇవి క్షణాల్లో బద్దలై రాళ్లతో కూడిన వరద దిగువ ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు జలాశయాల్లో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని ఎన్ఆర్ఎస్సీ సైంటిస్టులు చెబుతున్నారు.
