- నేపాల్ విపత్తుపై గతంలోనే రెండు నివేదికలిచ్చిన ఐసీఐఎంవోడీ
- గ్లేసియర్లు కరిగే వేగం రెట్టింపయ్యిందని హెచ్చరిక
- సమయం మించిపోకముందే చర్యలు తీసుకోవాలని సూచించిన నిపుణులు
న్యూఢిల్లీ: నేపాల్ విపత్తు గురించి ఒక ఆందోళనకరమైన నిజం వెలుగులోకి వచ్చింది. అక్కడ భయంకరమైన జలప్రళయం సంభవించే ప్రమాదం ఉందని ఐదు నెలల కిందటే రెండు ప్రత్యేక నివేదికలు వార్నింగ్ ఇచ్చాయి. హిందూ కుష్ హిమాలయ (హెచ్ కేహెచ్) ప్రాంతంపై నిరంతరం అధ్యయనం చేసే ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ (ఐసీఐఎంవోడీ)’ ఐదు నెలల క్రితమే ఈ నివేదికలను విడుదల చేసింది. ఆ రిపోర్టుల ప్రకారం.. హిమాలయ ప్రాంతాల భవిష్యత్తుకు ఊహకందని ముప్పు పొంచి ఉందని తేలింది.
గ్లేసియర్లు(మంచు నిల్వలతో ఏర్పడిన రిజర్వాయర్లు) వేగంగా కరిగిపోతున్నాయి.1975 నుంచి ఇప్పటివరకు 27 మీటర్ల మందంలో మంచు కరిగిపోయింది. ముఖ్యంగా 2000 తర్వాత గ్లేసియర్లు కరిగే వేగం రెట్టింపు అయిందని.. దీనివల్ల హిమాలయ క్రియోస్పియర్ పూర్తిగా దెబ్బతిన్నదని నివేదిక తెలిపింది. కారకోరం, సిక్కిం, భూటాన్ వంటి ప్రాంతాల్లో సరైన పర్యవేక్షణ కొరవడటం వల్ల వాస్తవ పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం కూడా ఉందని నివేదికలు పేర్కొన్నాయి.
గ్లేసియర్లు కరగడం వల్ల వచ్చే ముప్పు కేవలం నేపాల్కే పరిమితం కాకుండా, హిమాలయ నదుల నీటిపై ఆధారపడే దిగువ ప్రాంతాల్లోని ప్రజల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందని నివేదికలు హెచ్చరించాయి. ఇది సింధు, గంగా, బ్రహ్మపుత్ర బేసిన్లలోని కోట్లాది మంది ప్రజల తాగునీరు, వ్యవసాయం, విద్యుత్, జీవనోపాధి భద్రతకు పెద్ద ముప్పుగా మారుతోందని..అలాంటి ప్రమాదం రాకముందే తగిన చర్యలు తీసుకోవాలని ఐసీఐఎంవోడీ రిలీజ్ చేసిన రెండు నివేదికలు ఐదు నెలల కిందటే స్పష్టం చేశాయి.ఈ నివేదికలు చెప్పిన భయమే ఇప్పుడు నిజమైంది.
