- సైబరాబాద్లో సరికొత్త ఐడియా
- రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్లతో వాటర్ లాగింగ్కు చెక్
- ప్రయోగాత్మకంగా ప్రగతినగర్ లో ఏర్పాటు
- 82 మేజర్ పాయింట్లపై సీఎంసీ దృష్టి
హైదరాబాద్ సిటీ, వెలుగు : సైబరాబాద్ పరిధిలో రోడ్లపై వాటర్ లాగింగ్ పాయింట్లతో ట్రాఫిక్సమస్య ఏర్పడుతుండడంతో..దానికి చెక్ పెట్టడంతో పాటు వర్షపు నీటితో భూగర్భ జలాలు పెంచేందుకు అధికారులు విన్నూత కార్యక్రమం చేపట్టారు. ఇప్పటివరకు వాటర్లాగింగ్పాయింట్ల వద్ద నీరు నిలిస్తే మోటార్లతో డ్రైనేజీలు, నాలాల్లో కలుపుతున్నారు. అయితే, సీఎంసీ దీనికి భిన్నంగా రోడ్లపై నిలుస్తున్న వర్షపు నీటితో భూగర్భ జలాలు పెంచేందుకు ప్లాన్రూపొందించింది. నీరు నిలిచే ప్రాంతాల్లో 12 ఫీట్ల పొడవు,15 ఫీట్ల వెడల్పు 20ఫీట్ల లోతుతో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్లు ఏర్పాటు చేస్తోంది. ఇంకుడు గుంతతో పాటు రూ.5 లక్షల ఖర్చుతో 300 ఫీట్లు, 100 ఫీట్లతో వేర్వేరు బోర్లు వేస్తోంది. వీటి ఆధారంగా అక్కడ నిలిచే వర్షపు నీటిని భూగర్భంలోకి పంపిస్తున్నారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రగతినగర్ కమాన్ సమీపంలో అమలు చేశారు. కేజీఆర్ ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డుపై నిలిచే వర్షం నీటితో ట్రాఫిక్జామ్సమస్య ఏర్పడుతోంది. హార్వెస్టింగ్పిట్ఏర్పాటుతో సమస్య సగం వరకు తీరింది. దీంతో ఇటువంటి రెయిన్వాటర్ హార్వెస్టింగ్ పిట్లు మరిన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
82 ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్లాన్
సైబరాబాద్కమిషనరేట్పరిధిలో 202 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉండగా, ఇందులో 82 మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్లున్నాయి. ఇక్కడ వర్షం పడితే చాలు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో ఈ ప్రాంతాల్లో అవకాశాన్ని బట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్లు ఏర్పాటు చేయనున్నారు. జీహెచ్ఎంసీలో వర్షపు నీటిని త్వరగా క్లియర్ చేసేందుకు రెయిన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నిర్మించగా, సీఎంసీలో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది.
చెత్త, ప్లాస్టిక్ చేరొద్దు..
హార్వెస్టింగ్ పాయింట్ల ఏర్పాటుతోనే సమస్య పూర్తిగా పరిష్కారం కాదని, వర్షాలతో పాటు మట్టి, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు చేరితే నీటి ప్రవాహం, రీచార్జ్ ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు సిల్ట్ తొలగించడం, ఫిల్టర్లను శుభ్రం చేయడం, ఇంజెక్షన్ బోర్వెల్స్ను నిర్వహించడం వంటి పనులు నిరంతరం చేపట్టాలని చెబుతున్నారు.
