కరోనా డేంజర్ బెల్స్.. ఉస్మానియా లో ఇద్దరు మృతి

కరోనా డేంజర్ బెల్స్.. ఉస్మానియా లో ఇద్దరు మృతి
  • కరోనా డేంజర్ బెల్స్ 
  • ఉస్మానియ దవాఖానలో ఇద్దరు మృతి
  • చనిపోయిన తర్వాత కొవిడ్ గా నిర్ధారణ
  • రాష్ట్రంలో 55కు చేరిన యాక్టివ్ కేసులు
  • హైదరాబాద్ నగరంలోనే 45 మందికి..

హైదరాబాద్ : కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో రాజధాని నగరంలోని ఉస్మానియా దవాఖానలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. చనిపోయిన తర్వాత వీరికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఒకరి వయస్సు 60 ఏండ్లు, కాగా మరొకరి ఏజ్ 42 సంవత్సరాలు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 55కు చేరింది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 45 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ గణంకాలు చెబుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లో మళ్ళీ భయం మొదలైంది. 

జిల్లాల వారీగా పరిశీలిస్తే.. రంగారెడ్డి -3, సంగారెడ్డి-2, ఖమ్మం- 1, కరీంనగర్- 1, వరంగల్ -2, మెదక్ -1 కేసులను గుర్తించారు. ఇక హైద్రాబాద్ లో ఉన్న పాజిటివ్ కేసుల్లో.. ఫీవర్ ఆస్పత్రి లో 5 పాజిటివ్ కేసులు కాగా.. చెస్ట్ హాస్పిటల్ లో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక నిలోఫర్ లో 2, మిగితా కేసులు గాంధీ ఆస్పత్రి తో పాటు ఇతర ఆస్పత్రుల్లో ఉన్నాయని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి లో 10 పాజిటివ్ కేసులు కాగా.. అందులో 8 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇద్దరు మృతి చెందారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా వాడాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.