4 గంటలు సాగిన ఎన్ కౌంటర్.. ఇద్దరు నిందితులు హతం

4 గంటలు సాగిన ఎన్ కౌంటర్.. ఇద్దరు నిందితులు హతం

చండీగఢ్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ కు సమీపంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య  దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు హతమయ్యారు. సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నలుగురు గ్యాంగ్‌స్టర్స్‌ కు సంబంధమున్నట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు అధికారులు చెప్పారు.

సిద్ధూ మూసేవాలా హత్యతో సంబంధమున్న గ్యాంగ్‌స్టర్స్‌ జగ్దీప్ సింగ్ రూప, మన్ ప్రీత్ సింగ్ అలియాస్ మన్ను కుస్సా అమృత్‌సర్- పాకిస్థాన్ సరిహద్దు అట్టారికి సమీపంలోని చీతాబక్నా ప్రాంతంలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు బలగాలు అక్కడ తనిఖీలు నిర్వహించారు. పోలీసులను చూసిన గ్యాంగ్‌స్టర్స్ వారిపై కాల్పులు జరపడం  ఎన్‌కౌంటర్‍కు దారితీసినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో ఏకే 47రైఫిల్, పిస్తోలుతో పాటు భారీ సంఖ్యలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 

మే 29న కాంగ్రెస్ నేత, ర్యాపర్ సిద్దూ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యాడు. మన్సా జిల్లాలోని మూసా గ్రామంలో మన్ను కుస్సా సిద్ధూపై ఏకే 47తో కాల్పులు జరిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్పటి నుంచి వీరి ఆచూకీ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.