
దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి రూపొందిస్తున్న చిత్రం ‘సీతారామం’. రష్మిక, సుమంత్, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్వప్న సినిమాస్ బ్యానర్పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 5న విడుదలవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ రెండు పాటల్ని రిలీజ్ చేశారు. రీసెంట్గా హైదరాబాద్లోని మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్లో మూడో పాటను విడుదల చేశారు. ‘కానున్న కళ్యాణం ఏమన్నది? స్వయంవరం మనోహరం.. రానున్న వైభోగం ఎటువంటిది? ప్రతి క్షణం మరో వరం.. విడువని ముడి ఇది కదా ముగింపు లేని గాథగా.. తరముల పాటుగా తరగని పాటగా’ అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి పెళ్లి గురించి అద్భుతమైన లిరిక్స్ రాశారు. విశాల్ చంద్రశేఖర్ ట్యూన్ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, సిందూరి కలిసి పాడారు. సాంగ్ లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దుల్కర్ మాట్లాడుతూ ‘ఇలాంటి అందమైన పాట చేయడం నా కెరీర్లో ఇదే మొదటిసారి. కాశ్మీర్ మంచుకొండల్లో చాలా అందంగా తీశారు. మోస్ట్ రొమాంటిక్ సాంగ్. విజువల్ వండర్లా ఉంటుంది. ఇది నా ఫేవరేట్’ అన్నాడు. చాలా గ్రాండ్గా షూట్ చేసిన ఈ పాట అందరికీ నచ్చుతుందంది మృణాళ్. ఇలాంటి ప్రేమకథలో నటించడం ఎక్సైటింగ్గా ఉందన్నాడు తరుణ్ భాస్కర్.