- ఏసీబీ అదుపులో హనుమకొండ సబ్రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్
హనుమకొండ, వెలుగు : హనుమకొండ సబ్ రిజిస్ట్రార్ 1 జమలాపురం రామనరసింహారావు, సబ్ రిజిస్ట్రార్- 2 దావులూరి ఆనంద్ను ఏసీబీ ఆఫీసర్లు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 2న ఏసీబీ ఆఫీసర్లు హనుమకొండ వడ్డేపల్లిలోని సబ్రిజిస్ట్రార్ ఆఫీస్ను తనిఖీ చేసి అవినీతి, అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. సబ్రిజిస్ట్రార్ల వద్ద ఉన్న డాక్యుమెంట్లు, మొబైల్స్ స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. దావులూరి ఆనంద్ రూ.44,28,625, జమలాపురం రామనరసింహారావు రూ.74 వేలు అక్రమంగా తీసుకున్నట్లు తేల్చారు.
ఆనంద్ ఇంట్లో రూ.24.61 లక్షలు, 819 గ్రాముల గోల్డ్, 2.6 కిలోల వెండితో పాటు హనుమకొండలోని కపిల్ చిట్స్లో రూ.30 లక్షల ఫిక్డ్స్ డిపాజిట్లు గుర్తించారు. ఈయన 8 రోజుల్లోనే రూ.16.23 లక్షలకుపైగా లంచాలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు.
ఎస్ఆర్వో 2 ఆనంద్ తన కుటుంబ సభ్యుల పేరున నక్కలగుట్టలోని కపిల్ కాకతీయ టవర్స్లో రూ.72 లక్షల విలువైన రెండు కమర్షియల్ స్పేస్లు కొనుగోలు చేసినట్లు తేలింది. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను అరెస్ట్ చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరినీ ఖమ్మం సబ్జైలుకు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

