పిల్లలు అనుకున్నాం.. ఏం ఆడతారులే అనుకుంటే.. గ్రౌండ్లో దిగినప్పటి నుంచి పిచ్చపిచ్చగా రెచ్చిపోయారు. 50 ఓవర్లలో ఏకంగా 411 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. బంతి బంతిని చితక్కొట్టారు. బంతి కోసం వెయిటింగ్ అన్నట్లు.. బ్యాట్తో రెచ్చిపోయి.. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో.. ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టుకు 412 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చారు.
వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి దిగినప్పటి నుంచి సిక్సులు, ఫోర్లతో వీర బాదుడు బాదేశాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సులతో చెలరేగి ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈ చిచ్చరపిడుగులో ఏమాత్రం ఉడుకు చల్లారలేదు. 80 బంతుల్లో 15 సిక్సులు, 15 ఫోర్లతో దుమ్ములేపాడు. స్పిన్ లేదు. పేస్ లేదు. బౌలర్ ఎవరని చూసింది లేదు. 80 బంతుల్లో 175 పరుగులు చేసి ఈ భారీ టార్గెట్ నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు.
175 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర క్యాచ్గా ఔట్ అయి వెనుదిరిగినప్పటికీ ఫైనల్ మ్యాచ్లో గుర్తిండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఆయుష్ మాత్రే 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. అభిగ్యాన్ కుందు 40 పరుగులు, విహాన్ మల్హోత్రా 30 పరుగులు, వేదాంత్ త్రివేది 32 పరుగులు చేయడంతో టీమిండియా అండర్–19 ఫైనల్ మ్యాచ్ లో మనోళ్లు ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ నిర్దేశించారు.
►ALSO READ | under 19 world cup: చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ బద్దలుకొట్టిన రికార్డ్స్ ఇవే..
టోర్నీ రికార్డు పరంగా చూసినా ఇండియాకు తిరుగులేదు. 16 సార్లు టోర్నీ జరిగితే ఇండియా పదిసార్లు టైటిల్ ఫైట్కు అర్హత సాధించింది. 2022 ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించిన చరిత్ర కూడా మనకే అనుకూలంగా ఉంది. మరోవైపు ఇంగ్లండ్ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఫైనల్కు వచ్చారు. సెమీస్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై గెలవడం గమనార్హం. బ్యాటింగ్లో బెన్ మేయెస్ (399), కెప్టెన్ థామస్ రేవ్ (299) నుంచి ప్రమాదం పొంచి ఉంది. అయితే ఓపెనర్లు బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్ ఫామ్లో లేకపోవడం ఇంగ్లండ్ను కలవరపెడుతోంది.
