ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే : ఉద్ధవ్ థాకరే

ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే : ఉద్ధవ్ థాకరే

సీఎం ఏకనాథ్ షిండే వర్గానిదే అసలైన శివసేన పార్టీ అని ఎన్నికల సంఘం ప్రకటించడంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే స్పందించారు. ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. ఈసీ నిర్ణయంపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.  సుప్రీంకోర్టు ఈసీ ఉత్తర్వులను పక్కన పెడుతుందని తాము ఖచ్చితంగా అనుకుంటున్నామని ఉద్ధవ్ తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య ఆధారంగా పార్టీ ఉనికిని నిర్ణయిస్తే ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీలను కొనుగోలు చేసి సీఎం కాగలరని థాకరే అన్నారు.  షిండే వర్గానికి చెందిన వారు ముందుగా బాలాసాహెబ్‌ను అర్థం చేసుకోవాలని చెప్పారు. మహారాష్ట్రలో మోడీ పేరు పనిచేయదు కాబట్టే  వారు తమ స్వలాభం కోసం బాలాసాహెబ్ ముసుగుతో  ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారని ఉద్ధవ్ విమర్శించారు.  కాగా 1966లో బాలాసాహెబ్‌ థాకరే స్థాపించిన శివసేన పార్టీపై థాకరే కుటుంబం పట్టు కోల్పోవడం ఇదే తొలిసారి.