కోరుట్ల, వెలుగు : సర్పంచ్ బరిలో నిలిచిన తమ్ముడు ఓడిపోవడాన్ని తట్టుకోలేక అతడి అక్క గుండెపోటుతో చనిపోయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పోతు రాజశేఖర్ సర్పంచ్ పదవి కోసం పోటీచేశాడు. గురువారం ఎన్నిక జరగడంతో రాజశేఖర్ అక్క కొక్కుల మమత (38) గంభీర్పూర్ గ్రామానికి వచ్చారు. గురువారం రాత్రి రిజల్ట్ రావడంతో రాజశేఖర్ ఓడిపోయాడు. ఈ విషయాన్ని తట్టుకోలేని అతడి అక్కకు గుండెపోటు రావడంతో కోరుట్లలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.

