పెద్దపల్లి టీఆర్ఎస్​లో లీడర్లకు పొగ

పెద్దపల్లి టీఆర్ఎస్​లో లీడర్లకు పొగ
  • దాసరి, పుట్టకు చెక్ పెడుతున్న హై కమాండ్
  • వాళ్లను పట్టించుకోవద్దని సెకండ్ క్యాడర్ కు ఆదేశాలు
  • ఈటల కు సన్నిహితులు కావడమే కారణం
  • పెద్దపల్లిలోభాను ప్రసాద్ లీడ్ రోల్
  • మంథనిలో మరో లీడర్ కోసం వెతుకులాట
  • ఓ ముఖ్య నేతకు గాలం వేస్తున్న రూలింగ్ పార్టీ
  • ఆసక్తి కరంగా గులాబీ రాజకీయాలు

పెద్దపల్లి, వెలుగు: ఈటల రాజేందర్​ఎపిసోడ్​ తర్వాత పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఈటలకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, మంథని నియోజకవర్గ ఇన్​చార్జి పుట్ట మధులకు టీఆర్ఎస్ హైకమాండ్ పొగపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ ఇద్దరు నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని లీడర్లకు, క్యాడర్​కు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెద్దపల్లి క్యాడర్​ను  ఎమ్మెల్సీ భానుప్రసాదరావు లీడ్​ చేస్తున్నారు. రెండు నెలలుగా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీనే కీ రోల్​ పోషిస్తున్నారు. ఇక మంథని నియోజకవర్గంలో క్యాడర్​ను నడిపే లీడర్​కోసం ఆ పార్టీ హైకమాండ్​వెతుకుతోంది.  అక్కడ ఒక జాతీయ పార్టీకి చెందిన కీలక నేతను లాగే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. లోకల్​ఎమ్మెల్యేను, జడ్పీ చైర్మన్​ను కేర్ చేయకుండా సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ, వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. 
ఈటల సన్నిహితులు కావడం వల్లే.. 
పెద్దపల్లి జడ్పీ​ చైర్మన్​ పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి మాజీ మంత్రి ఈటల రాజేందర్​కు అత్యంత సన్నిహితులు. కానీ ఈటల తన పదవికి, పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పెద్దపల్లి జిల్లాలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. పుట్టమధు ఈటలను రహస్యంగా కలిసి వచ్చాడనే వార్తలు షికారుచేశాయి. వెనువెంటనే లాయర్​ వామన్​రావు దంపతుల హత్య కేసులో జడ్పీ చైర్మన్​ పుట్ట మధు ను టార్గెట్​చేశారు.  ఉన్నట్టుండి ఆయన అదృశ్యం కావడం, ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం వెనుక టీఆర్​ఎస్​ హైకమాండ్​ఉందని, ఈటలకు మద్దతిస్తే ఏం జరుగుతుందో బెదిరించి వదిలిపెట్టిందనే చర్చ జరిగింది. అప్పటి నుంచి పుట్ట మధు పార్టీ, అధికారిక కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనడం లేదు.  ఇటీవల మంథని నియోజకవర్గంలోని రామగిరి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ దేవక్క, ఏఎంసీ చైర్మన్​ పూదరి సత్యనారాయణ నడుమ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. కానీ వాటిని సాల్వ్​ చేసేందుకు మధు ఏమాత్రం చొరవ చూపలేదు. ఇక ఎమ్మెల్యే మనోహర్​రెడ్డి, టీఆర్​ఎస్​లోని ఓ కులపు నేతలను ఈటల దగ్గరికి పంపించారనే ప్రచారం జరిగింది. దీనిపై హైకమాండ్​ఎమ్మెల్యే నుంచి వివరణ కూడా తీసుకున్నట్లు తెలిసింది. అప్పటి నుంచే వీరిద్దరినీ హైకమాండ్​పూర్తిగా పక్కనపెట్టినట్లు అర్థమవుతోంది. దుబ్బాక బై ఎలక్షన్​ నుంచి వరంగల్​ మున్సిపల్​ ఎన్నికల దాకా ప్రచారం కోసం  ఈ ఇద్దరు లీడర్లను పిలిపించుకున్న పార్టీ,  పక్కనే ఉన్న హుజూరాబాద్​ బై ఎలక్షన్​ కోసం మాత్రం వీరి పేర్లను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. 
ఎమ్మెల్యేను పట్టించుకోవట్లే..  
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సుప్రీం అని టీఆర్​ఎస్​ హైకమాండ్​ ఎన్నో సార్లు స్పష్టం చేసింది. కానీ పెద్దపల్లి ఎమ్మెల్యే విషయంలో ఆ రూల్​ను పక్కనపెట్టేసింది. దీంతో  చిన్న, పెద్ద లీడర్​ అనే తేడా లేకుండా నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా డైరెక్ట్​గా ఎమ్మెల్సీ భాను ప్రసాద్​రావు దగ్గరికో, హైకమాండ్​ దగ్గరకో పోతున్నారు. ఇటీవల టీఆర్​ఎస్​మున్సిపల్​​ ఫ్లోర్​ లీడర్​ కొలిపాక శ్రీనివాస్​ ఓ కేసు విషయంలో తనకు అన్యాయం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ సీఐ, ఓ విలేకరి కలిసి కోటి రూపాయలు డిమాండ్​ చేస్తున్నారని కమిషనర్​ను కలిశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే కోడలు, ప్రస్తుత మున్సిపల్​చైర్ పర్సన్​ను యునానమస్​ చేయడంలో శ్రీనివాసే కీలకపాత్ర పోషించారు. అలాంటి  కౌన్సిలర్​ ఎమ్మెల్యే తో సంబంధం లేకుండా డైరెక్ట్​గా కేటీఆర్​ దగ్గరకి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడం టీఆర్​ఎస్​లో చర్చకు దారితీసింది.
సంతోష్​ రాకతో క్యాడర్​కు క్లారిటీ..
ఇటీవల మంత్రి కేటీఆర్​ బర్త్​డే సందర్భంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్​కుమార్​ జిల్లాలో పర్యటించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాకుండా సుల్తానాబాద్​లో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే దాసరితో సంతోష్​ అంటీముట్టనట్లు వ్యవహరించారు. అక్కడి నుంచి గోదావరిఖనికి పోయిన సంతోష్​ రామగుండం ఎమ్మెల్యే చందర్​తో సమావేశమయ్యారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద పండుగలా చేసిన కార్యక్రమంలో  ప్రొటోకాల్​ ప్రకారం పెద్దపల్లి జడ్పీ చైర్మన్​పుట్టమధుకు పెద్దపీట వేయాల్సి ఉండగా,  పూర్తిగా అవైడ్​ చేయడం ఆయన అనుచరులను నిరాశపరిచింది. ఆ రోజు రామగుండం నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతమైన యైటింక్లయిన్​ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రొగ్రాంలో పుట్ట మధు పాల్గొన్నారు. దీంతో జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై రిపోర్ట్​ తీసుకోవడానికే సంతోష్​ వచ్చినట్లు చర్చ జరిగింది. అప్పటి నుంచి ఇక  ఈ ఇద్దరు నాయకులను టీఆర్​ఎస్​ పక్కన పెట్టినట్లే అని క్యాడర్​కు క్లారిటీ వచ్చేసింది.