
- దాసరి, పుట్టకు చెక్ పెడుతున్న హై కమాండ్
- వాళ్లను పట్టించుకోవద్దని సెకండ్ క్యాడర్ కు ఆదేశాలు
- ఈటల కు సన్నిహితులు కావడమే కారణం
- పెద్దపల్లిలోభాను ప్రసాద్ లీడ్ రోల్
- మంథనిలో మరో లీడర్ కోసం వెతుకులాట
- ఓ ముఖ్య నేతకు గాలం వేస్తున్న రూలింగ్ పార్టీ
- ఆసక్తి కరంగా గులాబీ రాజకీయాలు
పెద్దపల్లి, వెలుగు: ఈటల రాజేందర్ఎపిసోడ్ తర్వాత పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఈటలకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధులకు టీఆర్ఎస్ హైకమాండ్ పొగపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ ఇద్దరు నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని లీడర్లకు, క్యాడర్కు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెద్దపల్లి క్యాడర్ను ఎమ్మెల్సీ భానుప్రసాదరావు లీడ్ చేస్తున్నారు. రెండు నెలలుగా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీనే కీ రోల్ పోషిస్తున్నారు. ఇక మంథని నియోజకవర్గంలో క్యాడర్ను నడిపే లీడర్కోసం ఆ పార్టీ హైకమాండ్వెతుకుతోంది. అక్కడ ఒక జాతీయ పార్టీకి చెందిన కీలక నేతను లాగే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. లోకల్ఎమ్మెల్యేను, జడ్పీ చైర్మన్ను కేర్ చేయకుండా సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ, వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు.
ఈటల సన్నిహితులు కావడం వల్లే..
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి మాజీ మంత్రి ఈటల రాజేందర్కు అత్యంత సన్నిహితులు. కానీ ఈటల తన పదవికి, పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పెద్దపల్లి జిల్లాలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. పుట్టమధు ఈటలను రహస్యంగా కలిసి వచ్చాడనే వార్తలు షికారుచేశాయి. వెనువెంటనే లాయర్ వామన్రావు దంపతుల హత్య కేసులో జడ్పీ చైర్మన్ పుట్ట మధు ను టార్గెట్చేశారు. ఉన్నట్టుండి ఆయన అదృశ్యం కావడం, ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం వెనుక టీఆర్ఎస్ హైకమాండ్ఉందని, ఈటలకు మద్దతిస్తే ఏం జరుగుతుందో బెదిరించి వదిలిపెట్టిందనే చర్చ జరిగింది. అప్పటి నుంచి పుట్ట మధు పార్టీ, అధికారిక కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనడం లేదు. ఇటీవల మంథని నియోజకవర్గంలోని రామగిరి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ దేవక్క, ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణ నడుమ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. కానీ వాటిని సాల్వ్ చేసేందుకు మధు ఏమాత్రం చొరవ చూపలేదు. ఇక ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, టీఆర్ఎస్లోని ఓ కులపు నేతలను ఈటల దగ్గరికి పంపించారనే ప్రచారం జరిగింది. దీనిపై హైకమాండ్ఎమ్మెల్యే నుంచి వివరణ కూడా తీసుకున్నట్లు తెలిసింది. అప్పటి నుంచే వీరిద్దరినీ హైకమాండ్పూర్తిగా పక్కనపెట్టినట్లు అర్థమవుతోంది. దుబ్బాక బై ఎలక్షన్ నుంచి వరంగల్ మున్సిపల్ ఎన్నికల దాకా ప్రచారం కోసం ఈ ఇద్దరు లీడర్లను పిలిపించుకున్న పార్టీ, పక్కనే ఉన్న హుజూరాబాద్ బై ఎలక్షన్ కోసం మాత్రం వీరి పేర్లను కనీసం పరిగణలోకి తీసుకోలేదు.
ఎమ్మెల్యేను పట్టించుకోవట్లే..
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సుప్రీం అని టీఆర్ఎస్ హైకమాండ్ ఎన్నో సార్లు స్పష్టం చేసింది. కానీ పెద్దపల్లి ఎమ్మెల్యే విషయంలో ఆ రూల్ను పక్కనపెట్టేసింది. దీంతో చిన్న, పెద్ద లీడర్ అనే తేడా లేకుండా నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా డైరెక్ట్గా ఎమ్మెల్సీ భాను ప్రసాద్రావు దగ్గరికో, హైకమాండ్ దగ్గరకో పోతున్నారు. ఇటీవల టీఆర్ఎస్మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొలిపాక శ్రీనివాస్ ఓ కేసు విషయంలో తనకు అన్యాయం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ సీఐ, ఓ విలేకరి కలిసి కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారని కమిషనర్ను కలిశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే కోడలు, ప్రస్తుత మున్సిపల్చైర్ పర్సన్ను యునానమస్ చేయడంలో శ్రీనివాసే కీలకపాత్ర పోషించారు. అలాంటి కౌన్సిలర్ ఎమ్మెల్యే తో సంబంధం లేకుండా డైరెక్ట్గా కేటీఆర్ దగ్గరకి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడం టీఆర్ఎస్లో చర్చకు దారితీసింది.
సంతోష్ రాకతో క్యాడర్కు క్లారిటీ..
ఇటీవల మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ జిల్లాలో పర్యటించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాకుండా సుల్తానాబాద్లో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే దాసరితో సంతోష్ అంటీముట్టనట్లు వ్యవహరించారు. అక్కడి నుంచి గోదావరిఖనికి పోయిన సంతోష్ రామగుండం ఎమ్మెల్యే చందర్తో సమావేశమయ్యారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద పండుగలా చేసిన కార్యక్రమంలో ప్రొటోకాల్ ప్రకారం పెద్దపల్లి జడ్పీ చైర్మన్పుట్టమధుకు పెద్దపీట వేయాల్సి ఉండగా, పూర్తిగా అవైడ్ చేయడం ఆయన అనుచరులను నిరాశపరిచింది. ఆ రోజు రామగుండం నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతమైన యైటింక్లయిన్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రొగ్రాంలో పుట్ట మధు పాల్గొన్నారు. దీంతో జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై రిపోర్ట్ తీసుకోవడానికే సంతోష్ వచ్చినట్లు చర్చ జరిగింది. అప్పటి నుంచి ఇక ఈ ఇద్దరు నాయకులను టీఆర్ఎస్ పక్కన పెట్టినట్లే అని క్యాడర్కు క్లారిటీ వచ్చేసింది.