
నర్సంపేట, వెలుగు: బాలికల పట్ల వివక్ష చూపకుండా వారిని ప్రోత్సహించాలని యునిసెఫ్ దక్షిణ భారత చీఫ్ జలలాం తపస్సే సూచించారు. మంగళవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఆశాజ్యోతి మండల సమాఖ్య సౌజన్యంతో వరంగల్ జిల్లా నర్సంపేట మండలం జల్లి గ్రామంలో ‘స్నేహ వేసవి సెలవుల సమావేశాల వేడుక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలకు పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అందించి ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
అద్భుతమైన వేదికను జల్లి గ్రామంలో బాలికలు నడిపించడం అభినందనీయమని తెలిపారు. వరంగల్ కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని చెప్పారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, నర్సంపేట ఏఎంసీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ పాల్గొన్నారు.