
న్యూఢిల్లీ, వెలుగు: బుల్లెట్ వద్దని, బ్యాలెటే ముద్దు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బుల్లెట్ ను నమ్ముకున్నోళ్లు అంతా కాలగర్భంలో కలిసిపోయారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మొదటి నుంచి బుల్లెట్ ను వ్యతిరేకిస్తోందన్నారు. మావోయిస్టు నిర్మూలన తుది అంకానికి చేరిందన్నారు. బుల్లెట్ ను నమ్ముకున్న వారు పశ్చాత్తాపంతో ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. రాబోయే మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలించడం తథ్యమన్నారు.
మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఢిల్లీలోని చాణక్యపురి నేషనల్ పోలీస్ స్మారక స్తూపానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి బండి సంజయ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. పోలీస్ వీరుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదని ఒక ప్రకటనలో సంజయ్ అన్నా రు. పోలీసుల ధైర్యసాహసాలు, త్యాగాలను స్పూర్తిగా తీసుకుని ముందుకు నడుస్తామన్నా రు. బ్యాలెట్ను నమ్ముకున్న వాళ్లను ప్రజాస్వామ్యవాదులు స్వాగతించి అక్కున చేర్చుకుంటారని చెప్పారు.