ఎన్ని యుద్ధ విమానాలు కాదు.. ఎంతమంది ఉగ్రవాదులు చచ్చారో అడగాల్సింది: కిషన్ రెడ్డి

ఎన్ని యుద్ధ విమానాలు కాదు.. ఎంతమంది ఉగ్రవాదులు చచ్చారో అడగాల్సింది: కిషన్ రెడ్డి

హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం (మే 30) హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశ ప్రజలు కోరుకున్నారు.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రవాదులకు ప్రధాని మోడీ తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్థాన్‎లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయన్నారు. 

ఆపరేషన్ సిందూర్‎కు సంబంధించిన వివరాలను భారత సైన్యం స్పష్టంగా వివరించిందని.. ఇది ఎవరికీ తెలియకుండా జరిగింది కాదని పేర్కొన్నారు. భారత్ తమపై దాడులు చేసిందని పాక్ ప్రధాని కూడా ప్రపంచ దేశాల ముందుకు ఒప్పుకున్నారని.. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, రాబర్ట్ వాద్రా ఈ విషయంలో వితండవాదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాహుల్‌, రాబర్ట్‌ వాద్రా, రేవంత్‌రెడ్డి.. ముగ్గురూ దేశ సైనికశక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సైన్యం విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. 

ఏం సాధించారని తిరంగా ర్యాలీలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.. సైన్యం విజయాన్ని తిరంగా ర్యాలీ పేరుతో దేశమంతా పండుగ చేసుకుంటుంటే రేవంత్ రెడ్డికి అది బీజేపీ కార్యక్రమంగా కనిపిస్తుందో అని ప్రశ్నించారు. తిరంగా ర్యాలీలు బీజేపీ జెండాతో కాదని.. జాతీయ జెండాలతో నిర్వహిస్తున్నామని కౌంటర్ ఇచ్చారు. తిరంగా ర్యాలీ రాజకీయ కార్యక్రమం కాదని అనేక  సార్లు చెప్పామని గుర్తు చేశారు. 

పీవోకేను స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. అసలు పీవోకేను పాకిస్థాన్‎కు అప్పగించిందే కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. 1971లో భారత సైన్యం లాహోర్ వరకు వెళ్లితే.. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆర్మీని తిరిగి వెనక్కి పిలిపించారని ఆరోపించారు. అప్పట్లో 91 వేల మంది పాక్ సైనికులను భేషరతుగా విడుదల చేశారని అన్నారు. బీజేపీ హయాంలో పలుమార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాం.. మరీ కాంగ్రెస్ హయాంలో ఒక్కసారైనా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయా..? అని ప్రశ్నించారు. 

►ALSO READ | ఇందిరాగాంధీకి, మోదీకి పోలికేంటి.? సర్జికల్ స్ట్రైక్ చేసి గొప్పలు చెప్తున్నరు: మహేశ్ కుమార్ గౌడ్

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆపరేషన్ సిందూర్‎లో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయాయని కాదు.. ఎంత మంది ఉగ్రవాదులు మరణించారని అడగాల్సిందని చురకలంటిచారు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలను కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ఢిల్లీలో బడే మియా.. హైదరాబాద్ లో చోటే మియా ఒకేలా మాట్లాడుతున్నారని రాహుల్, రేవంత్ పై ధ్వజమెత్తారు. బీజేపీ, ప్రధాని మోడీపై ఎన్ని విమర్శలు చేసినా.. సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ అపాయింట్మెంట్ దొరకడం లేదని ఎద్దేవా చేశారు.