
హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఏకగ్రీవం అవ్వాలని తాను కోరుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం నుంచి అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. జులై 1వ తేదీన కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారని వివరించారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం మోతీనగర్ కాలనీ వాసులతో ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి వీక్షించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ నేతలు సునీల్ బన్సల్, శోభా కరంద్లాజే సమక్షంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. పసుపు బోర్డు, మెట్రోపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల కామెంట్లను ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు తెలంగాణ ప్రజల కోసమే. మేము పని చేసేది కూడా రాష్ట్ర ప్రజల బాగు కోసమే. రేవంత్ రెడ్డి కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో మేము పనిచేయం’’అని కిషన్ రెడ్డి అన్నారు.