- కవచ్ 3.2లో 63 స్టేషన్లను కవర్ చేస్తున్నమని వెల్లడి
హైదరాబాద్సిటీ, వెలుగు: రాష్ట్రంలో రూ.47,984 కోట్ల విలువైన రైల్వే పనులు పురోగతిలో ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. 346 కిలోమీటర్లమేర కొత్త రైల్వే లైన్లు, 513 కిలోమీటర్ల డబుల్ లైన్, మూడో లైన్, నాల్గో లైన్, బైపాస్ లైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు.
గురువారం హైదరాబాద్లోని నాంపల్లి స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి, ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. కవచ్ 3.2లో తెలంగాణలోని 63 స్టేషన్లను కవర్ చేస్తూ 639 కి.మీ.లకు పైగా రూట్ కిలో మీటర్లకు ఏర్పాటు చేశామన్నారు. ఈ సెక్షన్లలో కవచ్ 4.0 కి అప్గ్రేడ్ పనులు జరుగుతున్నాయని, అదనంగా 384 రూట్ కిలోమీటర్లలో కొత్తగా ఈ పనులు సాగుతున్నాయని చెప్పారు.
నాంపల్లి స్టేషన్కు రూ.327 కోట్లు
నాంపల్లి రైల్వేస్టేషన్ను రూ.327.27 కోట్ల వ్యయంతో డెవలప్ చేస్తున్నామని, ఆధునీకరణ పనులు స్పీడ్గా జరుగుతున్నాయని కిషన్రెడ్డి చెప్పారు. ఇక్కడి నుంచి రోజుకు 60 రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయని, సగటున 28 వేల మంది ప్రయాణికులు జర్నీ చేస్తున్నారన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరింత ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు.
ఇక్కడ 16 లిఫ్టులు..8 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు , బేస్మెంట్ పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, సీసీ టీవీ, వై-ఫై, ఫుడ్ కోర్టు, ఫార్మసీ, వైద్య సౌకర్యాలు, దివ్యాంగుల కోసం సౌలత్లు కల్పిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డీఆర్ఎం డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సందీప్ జైన్, సీపీఆర్ఓ ఎ. శ్రీధర్ ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు
