
తెలంగాణ రాజకీయాల్లో కుటుంబ డ్రామా నడుస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తాము సూత్రదారులం ,పాత్రదారులుం కావాల్సిన అవసరం లేదన్నారు. దోచుకున్న దానిని పంచుకోవడానికే కల్వకుంట్ల ఫ్యామిలీలో గొడవ జరుగుతోందని విమర్శించారు. హైదరాబాద్ లోని పార్టీ ఆఫీస్ లో పదాదికారుల సమావేశంలో మాట్లాడారు కిషన్ రెడ్డి. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీదే అధికారమని చెప్పారు. కొద్దిగా కష్టపడి ఉంటే 12 లేదా 13 ఎమ్మెల్యే సీట్లు గెలిచేవాళ్లమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్ కలిసి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టాయని విమర్శించారు కిషన్ రెడ్డి.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణను కాపాడుకోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరముందన్నారు. తెలంగాణను కాపాడడం బీజేపీ వల్లే సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు కిషన్ రెడ్డి
బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం ప్రస్తావన వస్తే తాను ఒప్పుకోలేదని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా రాజకీయ కుట్ర అని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. పార్టీని బలహీన పరిచేందుకే కొందరు కుట్ర పన్నుతున్నారని అంటున్నారు. అసలు బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎలాంటి చర్చ జరగలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ ను దగ్గరకు కూడా రానివ్వబోమని చెబుతున్నారు. మరో వైపు బీఆర్ఎస్,బీజేపీ ఎప్పటికైనా ఒక్కటేనని కాంగ్రెస్ చెబుతోంది.