కేసీఆర్ పై నిర్మలా సీతారామన్ ఫైర్

కేసీఆర్ పై నిర్మలా సీతారామన్ ఫైర్

బీఆర్ఎస్ ప్రభుత్వం పై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థపై జోకులు వద్దంటూ సీరియస్ అయ్యారు. 2014లో తెలంగాణకు 60వేల కోట్లు ఉన్న అప్పు ఇప్పుడు 3 లక్షల కోట్లు ఎలా అయ్యిందని ఆమె ప్రశ్నించారు. 2014 నుండి ఇప్పటివరకు కేంద్రం నుండి తెలంగాణ ప్రభుత్వానికి లక్షా 39వేల కోట్లు గ్రాంట్ రూపంలో వచ్చాయని నిర్మల వివరించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని నొవోటెల్‭లో కేంద్ర బడ్జెట్ పై దూరదర్శన్ ఏర్పాటు చేసిన.. కాక్లేవ్‭లో ఆమె పాల్గొన్నారు. నంబర్లు, ప్రాజెక్టులు చూసుకొని మాట్లాడాలని టీఆర్ఎస్ ప్రభుత్వం పై సెటైర్లు వేశారు. 

తెలంగాణలో మెడికల్ కాలేజీల ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్‭కు నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కాలేజీల కోసం ప్రతిపాదనలు పంపమంటే పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలున్న ఖమ్మం, కరీంనగర్ పేర్లనే కేంద్రానికి పంపించారని.. అందుకే వాటిని తిరస్కరించామని చెప్పారు. తెలంగాణలో ఏ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఉన్నాయో కూడా కేసీఆర్‭కి తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన డేటా ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు నో డేటా అవైలబుల్ అని ఎవరికి వర్తిస్తుందో ఆలోచించుకోమన్నారు. 2014 నుండి ఇప్పటివరకు 157 మెడికల్ కాలేజీలు స్థాపించామని.. వాటి వద్దనే నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ఆమె వివరించారు. తెలంగాణలో ఉపాధి హామీకి కేటాయించిన దానికన్నా ఎక్కువగానే ఖర్చు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.